స్టార్ మా ఛానెల్లో ప్రతిరోజూ ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'పొదరిల్లు'. రోజుకో సరికొత్త మలుపుతో సాగుతున్న ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 73 మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహా, చక్రిల మధ్య జరుగుతున్న హైడ్రామా వీక్షకులలో క్యూరియాసిటీని అమాంతం పెంచుతోంది.
తాజాగా జరిగిన ఎపిసోడ్లో విడాకుల వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. తన భార్య మహా ఎలాగైనా తనకు విడాకులు ఇస్తుందని భయపడిన చక్రి.. తమకు పెళ్లి చేసిన కానిస్టేబుల్ను ఆశ్రయించడం ఆసక్తిగా మారింది. విడాకులు ఆపేలా చేయాలని చక్రి కోరడంతో, ఆ కానిస్టేబుల్ నేరుగా మహాకు ఫోన్ చేసి లాయర్ ఎంక్వయిరీ పేరుతో అబద్ధాలు ఆడి వివరాలు ఆరా తీయడం కథలో హైలైట్గా నిలిచింది. దీంతో మహా తన విడాకుల ఆలోచనను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు, అసలు తమ పెళ్లి సమయంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా పెళ్ళి ఎలా జరిగిందనే అనుమానం మహాలో మొదలైంది. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు వివరాల కోసం తన వదిన హారికకు ఫోన్ చేయడం, అలాగే మాధవను కూడా పెళ్ళికి కావాల్సిన అడ్రెస్ ప్రూఫ్ డాక్యుమెంట్ల గురించి ఆరా తీయడం కథలో సరికొత్త ట్విస్ట్కు దారి తీస్తోంది.
సాధారణ కుటుంబ కథా నేపథ్యంతో మొదలైన 'పొదరిల్లు' అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. నటీనటుల సహజ నటన, ఎక్కడా బోర్ కొట్టించని స్క్రీన్ ప్లే ఈ సీరియల్ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రత్యేకించి మహా, చక్రిల మధ్య నడిచే ఎమోషనల్ అండ్ కన్ఫ్యూజింగ్ ట్రాక్ మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రధాన జంట కథతో పాటు.. గాయత్రి పెళ్లి ఫిక్స్ కావడం, శైలు స్కూటీ పాడై కేశవ దగ్గరికి వెళ్లడం వంటి ఉపకథలు కూడా సీరియల్ వేగాన్ని పెంచుతున్నాయి. ప్రతి పాత్రా కథలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిని మరల్చకుండా ఎంగేజింగ్గా ముందుకు తీసుకెళ్తున్నాయి. మహా విడాకుల నిర్ణయం మార్చుకుంటుందా లేదా అసలు నిజాలు తెలుసుకుని చక్రికీ బుద్ధి చెబుతుందా? మహా, చక్రిల విడాకుల వ్యవహారం కాస్తా కేశవ చెవిన పడటంతో కేశవ ఈ జంటను ఏమని ప్రశ్నిస్తాడు? గుట్టు రట్టవుతుందా? తదితర విషయాలు తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ కోసం వేచి చూడాల్సిందే!





