
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సృష్టించిన శకానికి అమరత్వం నిండి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ కథానాయకుడిగా పరిచయమైన తొలి చిత్రం 'షావుకారు' తెలుసు. 1950 ఏప్రిల్ 7వ తేదీన విడుదలైన ఈ క్లాసిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. విజయా ప్రొడక్షన్స్ బ్యానర్పై బి.నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ చిత్రానికి లెజెండరీ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాతోనే ప్రముఖ నటి జానకి టాలీవుడ్కి పరిచయమై, ఆ తర్వాత 'షావుకారు జానకి'గా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సత్యం అనే భూస్వామి క్యారక్టర్ ని ఎన్టీఆర్ పోషించగా సుబ్బులుగా జానకి చేసింది. ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. మాట తీరు కూడా ఎంతో మధురంగా ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ సరికొత్త ప్రేమకి పునాది అని కూడా చెప్పవచ్చు. మూవీకి చేసిన ఎస్ వి రంగారావు నుంచి ప్రతి ఒక్కరు కూడా నాచురల్ పెర్ఫార్మ్ ప్రదర్శించారు. కానీ కమర్షియల్గా ఎందుకు వెనుకబడిందో విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.
అప్పటివరకు తెలుగు ప్రేక్షకులు పౌరాణిక, జానపద చిత్రాలలోని నాటకీయతని , భారీ డైలాగులని చూడటానికి అలవాటు పడ్డారు. కానీ 'షావుకారు' పూర్తిగా భిన్నంగా, సహజత్వానికి అత్యంత దగ్గరగా సాగింది. చక్రపాణి అందించిన కథ, సంభాషణలు రోజువారీ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఈ అతి సహజత్వమే అప్పట్లో సినిమా ప్లాప్ కావడానికి ప్రధాన కారణమైంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఇది మరీ రియలిస్టిక్గా ఉందంటూ థియేటర్ల వైపు పెద్దగా మొగ్గు చూపలేదు.
దాదాపు 177 నిమిషాల నిడివి గల ఈ గ్రామీణ సామాజిక డ్రామా ఆనాటి మాస్ ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది.సినిమా కథ విషయానికి వస్తే, ఇందులో గోవిందరాజులు సుబ్బారావు పోషించిన షావుకారు చెంగయ్య పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఆయన కొడుకు సత్యం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. పక్కనే ఉండే రైతు రామయ్య (శ్రీవాత్సవ) కూతురు సుబ్బులు (జానకి)ని తన కోడలిగా చేసుకోవాలని చెంగయ్య ఆశపడతాడు. కానీ ఊరిలో వచ్చే కొన్ని గొడవల వల్ల రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. ఈ గొడవల మధ్య సున్నపు రంగడు అనే స్థానిక రౌడీ క్యారక్టర్ లో ఎస్.వి. రంగారావు అద్భుతమైన నటనని కనబరిచాడు. చివరికి రామయ్య, సుబ్బులు కలిసి రంగడి కుట్రలను భగ్నం చేసి, చెంగయ్య కుటుంబాన్ని కాపాడటంతో కథ సుఖాంతమవుతుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు అందించిన సంగీతం ఈ సినిమాకు ఒక పెద్ద ఎస్సెట్. ఇందులోని "దీపావళీ దీపావళీ ఇంటా ఇంటా ఆనంద దీపావళీ" మరియు "పలుకరాదటే చిలుకా" వంటి పాటలు ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్స్. కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం ఆ తర్వాత కాలంలో గొప్ప క్లాసిక్గా గుర్తింపు పొందింది. ఈ సినిమా ప్లాప్ అయినా కూడా ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినిమా చరిత్రని మార్చిన ఇటువంటి అరుదైన చిత్రాల విశేషాలు ఎప్పుడూ సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటూనే ఉంటాయి.




