
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'డ్రాగన్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైంది. వైద్యులు కనీసం 6 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ 'డ్రాగన్' షూటింగ్ కి బ్రేక్ పడలేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కా ప్లాన్తో షూటింగ్ కొనసాగిస్తున్నారు.
'డ్రాగన్' సినిమా విడుదల తేదీని వచ్చే ఏడాది జూన్ కి లాక్ చేయడంతో, నిర్ణీత డెడ్లైన్ ఫిక్స్ చేసుకుని ప్రశాంత్ నీల్ నాన్-స్టాప్గా వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకొని వచ్చే లోపు, ఆయన లేని సన్నివేశాలను పూర్తి చేసేలా పనిలో ఉన్నారు నీల్. ఇందులో భాగంగానే బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ హైదరాబాద్ షూటింగ్ సెట్లో అడుగుపెట్టారు. హైదరాబాద్ ఎయిర్పోర్టులో అనిల్ కపూర్ ల్యాండ్ అయిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండటంతో డ్రాగన్ సెట్స్లో ఆయన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని స్పష్టమైంది.
ఈ చిత్రం కథాంశం కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా అంతర్జాతీయ మాఫియా, డ్రగ్ వార్ నేపథ్యంలో సాగనుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 'గోల్డెన్ ట్రయాంగిల్' ప్రాంతం బ్యాక్డ్రాప్లో 4 నుండి 5 దేశాల మధ్య నడిచే నెట్వర్క్, చైనా ఆధారిత ఐలాండ్ మాఫియా, దావోస్ కనెక్షన్స్, అలాగే భారతదేశంలోని మణిపూర్ సరిహద్దు లింకులతో ఈ సస్పెన్స్ కథ రూపుదిద్దుకుంటోంది. ఈ ఇంటర్నేషనల్ మాఫియా సామ్రాజ్యంలో ఎన్టీఆర్ ఎవరూ ఊహించని విధంగా వైలెంట్ అండ్ పవర్ఫుల్ డాన్ అవతారంలో కనిపించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బాహుబలి, కేజీఎఫ్, సలార్ చిత్రాల తరహాలోనే మొదటి భాగంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, రెండవ భాగంతో భారీ లాభాలను కొల్లగొట్టే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్ కోలుకుని తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టగానే మిగిలిన టాకీ పార్ట్, హై-వోల్టేజ్ యాక్షన్ పార్ట్ను పూర్తి చేసి అనుకున్న సమయానికే థియేటర్లలోకి తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.
Dragon, NTR, Prashanth Neel, Anil Kapoor





