
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కాలంతో పనిలేకుండా ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా నిలిచిపోతాయి. అలాంటి క్లాసిక్ సినిమాల్లో 'లేత మనసులు' ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ అపూర్వ దృశ్యకావ్యం విడుదలవై నేటికి 60 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఈ సినిమా విశేషాలను, దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాలు, చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.
హర్నాథ్, జమున జంటగా కృష్ణన్-పంజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం మ్యూజికల్ హిట్ మాత్రమే కాకుండా, చైల్డ్ సెంటిమెంట్తో ప్రేక్షకులను కట్టిపడేసింది. "పిల్లలు దేవుడు చల్లని వారే", "కోడి ఒక కోనలో", "హలో మేడమ్ సత్యభామ" వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో బేబీ పద్మిని ద్విపాత్రాభినయంలో నటించి తన అమాయకమైన నటనతో అందరినీ మైమరపించింది. విడిపోయిన తల్లిదండ్రులను కలిపే పిల్లల కథాంశంతో వచ్చిన ఈ చిత్రం తర్వాతి కాలంలో వచ్చిన ఎన్నో కుటుంబ కథా చిత్రాలకు మాతృకగా నిలిచింది.
1965 లో వచ్చిన తమిళ చిత్రం 'కుజందైయుమ్ దైవముమ్'కి రీమేక్ ఇది. మాతృక షూటింగ్ సమయంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. డ్యూయెట్ పాట చిత్రీకరణలో భాగంగా తమిళ హీరో జయశంకర్ గడ్డివాము పైనుంచి దూకే క్రమంలో బ్యాలెన్స్ తప్పి నేరుగా జమున భుజాలపై పడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె మెడ తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో సరైన చికిత్స లభించకపోవడంతో ఆ మెడ నొప్పితోనే జమున తన జీవితాంతం గడపాల్సి వచ్చింది. తర్వాతి కాలంలో వచ్చిన పలు సినిమాల్లో జమున మెడ కాస్త వంగినట్లు కనిపించడానికి ఈ షూటింగ్ ప్రమాదమే ప్రధాన కారణం.
ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచిన 'లేత మనసులు' అనేక విభాగాలుగా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఎం.ఎస్. విశ్వనాథన్ అద్భుతమైన స్వరాలు ఈ సినిమాను ఎవర్గ్రీన్ గా నిలిపాయి. 60 ఏళ్లు పూర్తయినా కూడా తెలుగు సినీ ప్రియుల హృదయాల్లో 'లేత మనసులు' చెరగని ముద్ర వేస్తూనే ఉంది.
[60 Years of Letha Manasulu, Letha Manasulu 60 Years, Jamuna Letha Manasulu, Haranath Letha Manasulu, Letha Manasulu Movie, Telugu Classic Movies, Telugu Cinema, Telugu Film news, Telugu News]





