ENGLISH | TELUGU  

ఈ పాపం ఎవరిది..? అల్లు అర్జున్‌కి బాధ్యత లేదా?.. నిలదీస్తున్న ప్రేక్షకులు!

on Dec 5, 2024

సాధారణంగా ఏ ఫంక్షన్‌కైనా ఒక హీరో హాజరవుతున్నారంటే అతన్ని చూసేందుకు వందలాదిగా జనం వస్తారు. ఇక సినిమా ఫంక్షన్స్‌కైతే చెప్పక్కర్లేదు. అలాంటిది ఒక స్టార్‌ హీరో తన సినిమా రిలీజ్‌ రోజు థియేటర్‌కి వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. కానీ, ఆ హీరోకి మాత్రం ఆపాటి అవగాహన లేదని అర్థమవుతోంది. ఆ హీరో ఎవరో కాదు.. అల్లు అర్జున్‌. అతని లేటెస్ట్‌ మూవీ ‘పుష్ప2’కి దేశవ్యాప్తంగా ఎంత హైప్‌ వచ్చిందో, సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటివరకు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, సలార్‌, కల్కి వంటి సినిమాలకు మించిన హైప్‌ ఈ సినిమాకి వచ్చింది. ఆ సినిమాలన్నింటి కంటే ఎక్కువ ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఈ సినిమాకి జరిగిందని అందరూ చెప్పుకుంటున్నారు. దీంతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూశారు. డిసెంబర్‌ 5న ‘పుష్ప2’ రిలీజ్‌ అవుతున్నప్పటికీ డిసెంబర్‌ 4 రాత్రి గం.9.30ల నుంచే ప్రీమియర్‌ షోలు ప్రారంభించారు. టికెట్‌ రేట్లను ఎంత పెంచినా జనం ఎగబడి కొనుక్కున్నారు. అల్లు అర్జున్‌కి ఉన్న ఇమేజ్‌ దృష్ట్యా సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్‌ చేశారు. 

ఇంతవరకు బాగానే ఉంది... డిసెంబర్‌ 4 రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన దుర్ఘటన అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న భాస్కర్‌, అతని భార్య రేవతి, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్‌, సన్వీక ‘పుష్ప2’ ప్రీమియర్‌ చూసేందుకు సంధ్య థియేటర్‌కు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. అదే సమయంలో అల్లు అర్జున్‌ ఆ థియేటర్‌కి వచ్చారు. అతన్ని చూసేందుకు ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. అక్కడి పరిస్థితి అదుపు తప్పడంతో జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో రేవతి(39), ఆమె కుమారుడు శ్రీతేజ్‌(9), మరో వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయారు. పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి.. ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే రేవతి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె కుమారుణ్ని మరింత మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. 

తమ అభిమాన హీరో సినిమాని మొదటి షో చూద్దామని వచ్చిన ఒక కుటుంబానికి ఇంతటి దారుణం జరగడం అందర్నీ కలచివేస్తోంది. ఒక సాధారణ హీరో థియేటర్‌కి వస్తేనే అతన్ని చూసేందుకు జనం ఎగబడతారు. అలాంటిది ఒక పాన్‌ ఇండియా హీరో థియేటర్‌కి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవరైనా ఊహించగలరు. ఆ సమయంలో పోలీసులు లాఠీ చార్జి చేసి ఉండకపోతే మరిన్ని మరణాలు సంభవించేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తను థియేటర్‌కి వెళితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన అల్లు అర్జున్‌కి లేకుండా ఎలా ఉంటుంది అని అందరూ ప్రశ్నిస్తున్నారు. తనని తాను స్టార్‌ హీరో అనుకోవడం లేదా? లేక ఏం జరిగినా తనకేంటి? అనే నిర్లక్ష్యంతోనే అలా చేశాడా అనేది ఆలోచించాలి. మరో విషయం ఏమిటంటే.. తను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కి వస్తున్నట్టు తన అభిమానులకు ముందే ఇన్‌ఫర్మేషన్‌ ఇచ్చాడని, అందుకే థియేటర్‌ దగ్గర ఉండాల్సిన జనం కంటే ఎక్కువ ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రేక్షకుల, అభిమానుల క్షేమాన్ని కోరుకోవడం హీరోల బాధ్యత. అలాంటిది ఇలా బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించి ఒక నిండు ప్రాణాన్ని బలిగొని ఆ పిల్లల నుంచి తల్లిని దూరం చేసిన అల్లు అర్జున్‌ దీనికి పూర్తి బాధ్యత వహించాలని ప్రేక్షకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.