
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే 'పంచనామా'. ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను నిర్మాతగా, షో రన్నర్ గా వ్యవహరించడం విశేషం. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. హైదరాబాద్లో బుధవారం ప్రివ్యూ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. "ఈరోజు నేను ఎమోషనల్ అవ్వకూడదని అనుకున్నాను. నిర్మాతగా మారాలనేది నా సాధారణ కల కాదు. దాదాపు 15 ఏళ్లుగా ఒక తపస్సు చేస్తున్నాను. టెలివిజన్లోనే పుట్టాను, ఉదయభాను కాస్తా హృదయభానుగా మారింది అక్కడే.. అందుకే టెలివిజన్ నుంచే నా ప్రొడక్షన్ మొదలుపెట్టాలని ఇన్నేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేశానో, ఎంత మంచి కంటెంట్ మోసుకుంటూ ఎక్కడికెక్కడికో వెళ్లానో నాకే తెలుసు. వచ్చే వారం, వచ్చే నెల మొదలవుతుంది అనుకుంటూనే ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చివరికి నా చిన్ననాటి స్నేహితుడు శ్రీరామ్ ద్వారా 'జీ' హెడ్ అనురాధ గారిని కలిశాను. నా దగ్గరున్న కథలు, కాన్సెప్ట్స్ అన్నీ చెబితే ఆమెకు బాగా నచ్చాయి. ఆ తర్వాత వారి ఆలోచనలకు తగినట్లుగా ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది.
నా బిడ్డల కోసం నేను ఎలాగైతే తాపత్రయపడతానో.. ఈ ప్రాజెక్ట్ కోసం కూడా అంతే తాపత్రయపడ్డాను. ఇంత తక్కువ సమయంలో, ఇంత మంచి క్వాలిటీతో సిరీస్ పూర్తి చేయడానికి మా టీమ్లోని ప్రతి ఒక్కరూ 100 శాతానికి మించి శ్రమించారు. భరత్ గారికి కథ చెప్పగానే ఆయనకు నచ్చేసింది. లక్కీగా ఆయన డేట్లు దొరికాయి. ఎంతో స్టార్డమ్ ఉన్న ఆయన సెట్లో చాలా కంఫర్టబుల్గా పనిచేశారు.15 ఏళ్లుగా నా కడుపులో దాచుకున్న ఆవేదన, ఎమోషన్ ఇది. ఈ 'పంచనామా' సిరీస్ సెప్టెంబర్ 11న జీ5 లో విడుదలవుతోంది. ఇది కచ్చితంగా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను." అని అన్నారు.
[Udaya Bhanu, Emotional Speech, Panchanama Series, Telugu Series 2026, ZEE5 Telugu Series, Actor Bharath, Telugu Film News, Telugu News]




