
ఎంతో భవిష్యత్తుని ఊహించుకొని ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ప్రముఖ హీరోయిన్ ట్విషా శర్మ మే 12 న అనుమానాస్పద మృతిలో మరణించిన విషయం తెలిసిందే. . ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తన మొదటి చార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.
వివాహమైన కేవలం 5 నెలల వ్యవధిలోనే మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న అత్తవారింటిలో 31 ఏళ్ల ట్విషా శర్మ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీబీఐ, సుదీర్ఘంగా 90 రోజుల పాటు దర్యాప్తు జరిపిన అనంతరం సమర్పించిన చార్జిషీట్లో ఆత్మహత్యేనని పేర్కొంది. అయితే, ఈ ఆత్మహత్యకు గల ప్రధాన కారణం అదనపు కట్నం కోసం వేధింపులు, గృహహింస అని స్పష్టం చేస్తూ, ట్విషా భర్త సమర్థ్ సింగ్ అలాగే ఆమె అత్త, మాజీ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్లపై ఆత్మహత్యకు ప్రేరణ, కట్న వేధింపులు (డౌరీ డెత్), మరియు క్రూరత్వం కింద వివిధ తీవ్రమైన చట్టపరమైన సెక్షన్లను మోపింది.
సీబీఐ తన ఎఫ్ఐఆర్ మరియు నివేదికలో వెల్లడించిన కథనం ప్రకారం.. పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చినప్పటికీ, వివాహం తర్వాత రూ. 2 లక్షల అదనపు కట్నం కోసం అత్తవారింట్లో ట్విషాను మానసికంగా, శారీరకంగా విపరీతంగా వేధించారు. అంతేకాకుండా, ఆమెకి సొంత వ్యక్తిగత అవసరాల కోసం కూడా చిన్న రూపాయి ఖర్చు చేయడానికి డబ్బులు ఇవ్వకుండా అత్యంత దారుణంగా కట్టడి చేశారని అధికారులు ఛార్జిషీట్లో పొందుపరిచారు. మరణించడానికి కొద్దిరోజుల ముందు ట్విషా తన తల్లి మరియు స్నేహితురాలికి పంపిన వాట్సాప్ సందేశాలు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. తన జీవితం అత్తవారింట్లో నరకంలా మారిందని, ఈ వివాహ బంధంలో తాను దారుణంగా చిక్కుకుపోయానని, నిరంతరం వేధింపులకు గురవుతున్నానని ఆమె ఆ మెసేజ్లలో వాపోయింది. ఈ కేసు ప్రారంభంలో స్థానిక పోలీసుల తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కావడం, తొలి శవపరీక్ష నివేదికలోనూ, పోలీసు నివేదికలోనూ మృతురాలి ఎత్తు నమోదులో వైరుధ్యాలు ఉండటం, ఉరి వేసుకోవడానికి వాడిన మెటీరియల్ను పోలీసులు సేకరించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చాయి.
Also read: విశ్వనాధ్ అండ్ సన్స్ ని మిస్ చేసుకున్న ఆ ఇద్దరు హీరోలు వీళ్ళే!
ట్విషా కుటుంబ సభ్యులు తమ కుమార్తె మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయడానికి నిరాకరించి, దిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందంతో రెండోసారి శవపరీక్ష జరిపించాలని డిమాండ్ చేస్తూ 12 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఆ తర్వాత ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు హైకోర్టు అనుమతులతో సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ స్వీకరించింది. దిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం నేతృత్వంలో భోపాల్లో రెండవ పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు, క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి, డిజిటల్ మరియు ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. మే 22న జబల్పూర్ కోర్టు ముందు భర్త సమర్థ్ సింగ్ లొంగిపోగా, ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో మే 28న అత్త గిరిబాలా సింగ్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరూ జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ట్విషా 2021 లో తెలుగులో వచ్చన ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో హీరోయిన్ గా చేసింది.మాజీ మిస్ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్ కూడా.
Twisha Sharma, Tollywood





