
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్, తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో.. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను గవర్నర్ కార్యాలయానికి తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (Thalapathy Vijay)
వివాదానికి కారణం?
గవర్నర్తో జరిగిన కీలక సమావేశంలో విజయ్ వెంట ఇద్దరు వ్యక్తులు కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వారు మరెవరో కాదు.. ఒకరు 'జననాయగన్' నిర్మాత వెంకట్ కె. నారాయణ (కర్ణాటక), మరొకరు ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రానైట్, మైనింగ్ వ్యాపారవేత్త విష్ణు రెడ్డి.
పార్టీలో ఎలాంటి అధికారిక పదవులు లేని, రాజకీయాలకు సంబంధం లేని ఈ ఇద్దరు వ్యక్తులు.. ప్రభుత్వ ఏర్పాటు వంటి అత్యంత కీలకమైన చర్చల సమయంలో లోక్ భవన్లో ఎందుకు ఉన్నారని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
"తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించే చర్చల్లో కర్ణాటకకు చెందిన సినీ నిర్మాతకు, ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారికి ఏం పని?" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రేపు వీరే వెనుక నుండి ప్రభుత్వం నడుపుతారా? అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రైవేట్ వ్యక్తులను అధికారిక భేటీలకు గవర్నర్ కార్యాలయం ఎలా అనుమతించిందనే కోణంలోనూ వివరణ కోరుతున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు అయితే, తన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, అధికారిక భేటీలకు వ్యాపారవేత్తలను, నిర్మాతలను తీసుకెళ్లడం వల్ల రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ వివాదంపై విజయ్ లేదా టీవీకే వర్గాలు ఎలాంటి వివరణ ఇస్తాయో వేచి చూడాలి.
రాజకీయ ఉత్కంఠ
ఒకవైపు ఈ వివాదం నడుస్తుండగానే, మరోవైపు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. VCK పార్టీ ఇంకా విజయ్కు మద్దతు లేఖ ఇవ్వలేదు. IUML పార్టీ డీఎంకే కూటమిలోనే ఉండాలని నిర్ణయించుకోవడం విజయ్ కూటమి లెక్కలను మారుస్తోంది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే 118 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం 116 ఉన్నారు. VCK పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కోసం విజయ్ చర్చలు జరుపుతున్నారు.






