Home

»

Latest News

హీరోయిన్ ఛాన్స్ అంటూ ఘోర మోసం.. ఏం దోచుకున్నాడో తెలుసా!  

May 29, 2026 11:20AM

 


హీరోయిన్ గా వెలిగిపోవాలనే ఆశ, అమాయకత్వం కలిసి ఒక యువతిని కోలుకోలేని దెబ్బ తీశారు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను గుడ్డిగా నమ్మితే ఎంతటి ఘోరం జరుగుతుందో నిరూపించేలా వైజాగ్ కేంద్రంగా ఒక షాకింగ్ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టీవీ సీరియల్స్‌లో హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇప్పిస్తానంటూ నమ్మబలికిన ఒక కేటుగాడు, తెలంగాణకు చెందిన ఒక ప్రముఖ వైద్యుడి భార్యని  టార్గెట్ చేసి  60 లక్షలు కొల్లగొట్టాడు. ఈ హై-ప్రొఫైల్ మోసం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని విశాఖపట్నం నగరంలోని మధురవాడ బాంబే కాలనీకి చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు లక్ష్మీ వరప్రసాద్ సోషల్ మీడియా వేదికగా బాధితురాలికి పరిచయమయ్యాడు. తనకు టెలివిజన్ మరియు సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద సెలబ్రిటీలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇండస్ట్రీలో తలుచుకుంటే ఎవరినైనా రాత్రికి రాత్రే స్టార్‌ను చేయగలనని నమ్మబలికాడు. ప్రముఖ టీవీ ఛానళ్లలో వచ్చే సీరియల్స్‌లో లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పిస్తానని బాధితురాలికి ఆశ చూపించాడు. గ్లామర్ ప్రపంచంపై ఉన్న ఆసక్తితో ఆమె కూడా నిందితుడి మాటలను పూర్తిగా నమ్మేసింది.

ఒక్కసారి బాధితురాలు తన ట్రాప్‌లో పడిందని గ్రహించిన లక్ష్మీ వరప్రసాద్ తన అసలు రంగు బయటపెట్టాడు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రొడక్షన్ ఖర్చులు, ఛానల్ మేనేజ్‌మెంట్ల మేనేజ్‌మెంట్ ఫీజులు, రిజిస్ట్రేషన్లు, ఆర్టిస్ట్ కార్డ్స్ మరియు వివిధ రకాల కాంటాక్ట్ అడ్వాన్సుల పేరుతో దశలవారీగా భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించాడు. అవకాశాల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడిన బాధితురాలు, విడతల వారీగా  60 లక్షల వరకు నిందితుడి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. అంతటితో ఆగని ఈ కేటుగాడు, బాధితురాలి నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని, ఆమె బ్యాంక్ ఖాతా నుంచే ఏకంగా రూ. 22 లక్షల విలువైన ఒక లగ్జరీ కారును కూడా కొనుగోలు చేశాడు.

డబ్బులు మొత్తం చేతులు మారిన తర్వాత సీరియల్స్ ఊసే లేకపోవడంతో పాటు నిందితుడి ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన బాధితురాలు మోసపోయానని గ్రహించింది. దీనితో ఆమె తెలంగాణ పోలీసులని  ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా బాధితురాలి డబ్బుతో నిందితుడు కొనుగోలు చేసిన కారుకు సంబంధించిన కార్ల షోరూం బ్యాంక్ అకౌంట్‌ను పోలీసులు వెంటనే ఫ్రీజ్ చేశారు. అకౌంట్ ఫ్రీజ్ కావడంతో సదరు షోరూం యజమాని తీవ్ర ఆందోళనకు గురై విశాఖ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రస్తుతం తలదాచుకున్న నిందితుడు జంబాడ లక్ష్మీ వరప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తులను నమ్మి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా సినిమా, టీవీ సీరియల్ అవకాశాలు ఇప్పిస్తామనే ల్యూర్స్ (ఆశలు), పార్ట్ టైమ్ ఉద్యోగాలు లేదా రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే పెట్టుబడి స్కామ్‌ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే '1930' సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com