
స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ది ఇండియా స్టోరీ' (The India Story). జీ స్టూడియోస్, మిగ్ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ తాజాగా విడుదలైంది. సమాజంలో మన కళ్లముందే జరుగుతున్న ఒక భయంకరమైన, చేదు నిజం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.
మనం రోజూ తినే ఆహారం ఎంతలా కలుషితం అవుతోంది, అది మన ప్రాణాల మీదకు ఎలా తెస్తోంది అనే సున్నితమైన, ఆలోచింపజేసే పాయింట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. "ఇండియాస్ మోస్ట్ షాకింగ్ ట్రూత్" అంటూ ప్రారంభమైన ఈ టీజర్, దేశంలో జరుగుతున్న కల్తీల వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఆహార పదార్థాల్లో, పాలలో కెమికల్స్ కలపడం.. కూరగాయలు, పండ్లలో ఇంజెక్షన్లు గుచ్చడం వంటి దారుణాలను ఈ టీజర్లో ఒళ్లు గగుర్పొడిచేలా చూపించారు.
కల్తీ ఆహారం వల్ల దేశంలో ప్రతి 60 సెకన్లకు ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారనే షాకింగ్ గణాంకాలను కూడా ఈ టీజర్లో ప్రస్తావించారు. ప్రతి ముగ్గురిలో ఒక కుటుంబం క్యాన్సర్ లాంటి మహమ్మారితో పోరాడుతుందని, ఏటా కోటి మందికి పైగా దీనివల్ల చనిపోతున్నారనే చేదు నిజాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. "ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్" అంటూ సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని కరెక్ట్గా ఎలివేట్ చేశారు. ఈ టీజర్లో ఒక చిన్న పాప "అమ్మా ఈరోజు వంటలో ఏం చేసావ్?" అని అడిగే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తుంది.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గ్లామర్ పాత్రలకే కాకుండా ఇలాంటి సందేశాత్మక చిత్రాల్లో నటించడానికి ఆమె ముందుకు రావడం విశేషం. చేతన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ బి. షిండే కథను అందిస్తూ నిర్మించారు. బలమైన కంటెంట్తో వస్తున్న ఈ సినిమా జూలై 24, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అవుతుండగా, ఇదొక కనువిప్పు కలిగించే సినిమా అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






