
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆఖరి చిత్రం కావడంతో ‘జననాయగన్’ (తెలుగులో 'జననాయకుడు') సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశానికి ముందు నటించిన చివరి చిత్రం కావడం, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ క్రేజ్ నెలకొంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సంబంధించి తాజాగా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏకంగా “A” సర్టిఫికెట్ను జారీ చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. సాధారణంగా విజయ్ నటించే సినిమాలకు U/A సర్టిఫికెట్లు రావడం సర్వసాధారణం. కానీ ఆయన కెరీర్లో దాదాపు 24 సంవత్సరాల తర్వాత, అంటే 2002లో వచ్చిన ‘భగవతి’ సినిమా తర్వాత మళ్లీ ‘A’ సర్టిఫికెట్ పొందిన రెండవ చిత్రం ఇదే కావడం విశేషం.
ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ గత కొన్ని నెలలుగా అనేక వివాదాలు, న్యాయపరమైన చిక్కుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సెన్సార్ బోర్డు సూచించిన కొన్ని కీలక మార్పులు, కట్స్ తర్వాత ఈ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాలో మొత్తం 20 సెకన్ల పాటు సాగే విజువల్స్, డైలాగ్స్కు కట్స్ విధించగా, మరో 10 సెకన్ల కంటెంట్ను రీప్లేస్ చేశారు. వీటిలో రాజకీయ పరమైన డైలాగులు, కొన్ని సున్నితమైన మతపరమైన ప్రస్తావనలతో పాటు టీవీకే పార్టీకి సంబంధించిన కొన్ని రిఫరెన్స్ల మ్యూటింగ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కట్స్ అన్నింటి తర్వాత కూడా సినిమా రన్టైమ్ను 183 నిమిషాల 11 సెకన్ల ( 3 గంటల 3 నిమిషాల) సుదీర్ఘమైన నిడివితో లాక్ చేశారు.
సెన్సార్ బోర్డు క్లియరెన్స్ పూర్తి చేసుకున్న తరుణంలో మేకర్స్ విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సరికొత్త పోస్టర్లో దళపతి విజయ్ అత్యంత రగ్గడ్ అండ్ వయోలెంట్ లుక్లో, చేతిలో కొరడా పట్టుకుని ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో పెద్దగా ‘A’ అనే అక్షరాన్ని బ్లడ్ రెడ్ కలర్లో డిజైన్ చేసి, దానిపై 'CERTIFIED' అని ముద్రించారు. విజయ్ ముఖంలో కనిపిస్తున్న తీవ్రత, చుట్టూ ఉన్న జనం ఆయన వైపు దీనంగా చూస్తున్న తీరు సినిమాలోని ఇంటెన్సిటీని స్పష్టం చేస్తోంది. పోస్టర్పైనే "ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు సి. జోసెఫ్ విజయ్" అని ప్రస్తావించడం, కింద "జననాయగన్" టైటిల్ డిజైన్ పవర్ఫుల్గా ఉండటం ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తోంది.
ఈ చిత్రంలో విజయ్తో పాటు పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప్రధాన విలన్గా నటిస్తున్నారు. వీరికి తోడు ప్రకాష్ రాజ్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టే అవకాశముంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
Thalapathy Vijay, Jana Nayagan, Jana Nayakudu, TeluguOne




