తెలంగాణలో సినిమా టికెట్ల ధరల సవరణ మరియు థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలను క్రమబద్ధీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు (G.O.) జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త జీవో ప్రకారం నాన్-ఏసీ, ఏసీ సింగిల్ స్క్రీన్లతో పాటు స్పెషల్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్లలో పాటించాల్సిన కనిష్ఠ (మినిమం), గరిష్ఠ (మాగ్జిమం) టికెట్ ధరలను స్పష్టంగా ఖరారు చేశారు.
సవరించిన టికెట్ ధరలు
నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో
కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70,
ప్రీమియంలో
కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100
ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో
కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150.
ఏసీ థియేటర్లలో ప్రీమియంలో
కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200.
స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో
కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250
సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమాలు అందుబాటులో ఉండేలా ప్రతి థియేటర్లోనూ స్థానంతో సంబంధం లేకుండా కనీసం 25 శాతం సీట్లను తప్పనిసరిగా నాన్-ప్రీమియం కేటగిరీ కింద తక్కువ ధరలకే అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతంలో టికెట్ ధరలపై స్పష్టత లేకపోవడంతో భారీ చిత్రాలు విడుదలైన సమయంలో టికెట్ ధరలు అడ్డగోలుగా పెంచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యేవి. ఈ కొత్త మార్గదర్శకాల ద్వారా రేట్లను నియంత్రించి, ప్రేక్షకులకు సులభంగా వినోదాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
మరోవైపు, ఈ నిర్ణయంపై థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్ల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నిర్దిష్టమైన రేట్లు నిర్ణయించడం వల్ల థియేటర్ల నిర్వహణ సులభతరం అవుతుందని, ప్రేక్షకులకు కూడా పారదర్శకంగా ఉంటుందని పంపిణీదారులు భావిస్తున్నారు.
ఈ కొత్త ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీనితో పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలు కూడా అమలులోకి రానున్నాయి. రాబోయే పెద్ద సినిమాల విడుదల సమయానికి ఈ ధరల అమలుపై స్పష్టత రావడంతో ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.




