Home

»

Latest News

మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రజినీ.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

Aug 12, 2025

1975 ఆగస్ట్‌ 15న విడుదలైన అపూర్వ రాగంగళ్‌ చిత్రంతో తన సినిమా కెరీర్‌ ప్రారంభించిన సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఈ ఏడాది ఆగస్ట్‌ 15కి నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. తలైవా స్వర్ణోత్సవాన్ని అభిమానులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే స్వర్ణోత్సవానికి ఒక రోజు ముందు రజినీ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘కూలీ’ రిలీజ్‌ కాబోతోంది. 74 ఏళ్ళ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోలకు సైతం పోటీ ఇస్తున్న రజినీ సినిమాల విషయంలో తన దూకుడును కొనసాగిస్తున్నారు. తాజాగా మరో కొత్త సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం రజినీ ‘జైలర్‌2’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల నటుడు, దర్శకుడు ఎం.శశికుమార్‌ రజినీకి ఓ కథ చెప్పారని, దానికి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా దొరికిందని కోలీవుడ్‌ ఇన్‌సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 1999లో సేతు చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన శశికుమార్‌.. 2008లో సుబ్రమణ్యపురం చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి అవార్డులు కూడా గెలుచుకుంది. తెలుగులో అనంతపురం పేరుతో విడుదలై ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న శశికుమార్‌ ఇటీవల వచ్చిన టూరిస్ట్‌ ఫ్యామిలీ చిత్రం మంచి విజయం సాధించింది. 

ఎప్పటికైనా రజినీకాంత్‌ని డైరెక్ట్‌ చెయ్యాలన్నది శశికుమార్‌ డ్రీమ్‌. రజినీకి సరిపోయే కథను కొంతకాలంగా సిద్ధం చేస్తున్నారు. టూరిస్ట్‌ ఫ్యామిలీ మంచి విజయం సాధించడంతో నటుడిగా మరిన్ని అవకాశాలు శశికి వస్తున్నాయి. కానీ, తన దృష్టంతా స్క్రిప్ట్‌పై పెడుతున్నారు. కథ ఫైనల్‌ స్టేజ్‌కి వచ్చిందట. ఇటీవల రజినీకి కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రజినీ చేస్తున్న సినిమాలన్నీ హై ఓల్టేజ్‌లో ఉంటున్నాయి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటూ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తున్నాయి. ఆ తరహా సబ్జెక్ట్‌తోనే శశికుమార్‌.. రజినీని అప్రోచ్‌ అయినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ‘జైలర్‌2’ తర్వాత శశికుమార్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com