
వరంగల్ జిల్లాకు చెందిన చిన్నారి పొనుగంటి నిరంజన్ మరణవార్త కేవలం టాలీవుడ్లోనే కాకుండా, యావత్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న ఈ చిన్నారి, మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ చిన్నారి మరణం రియల్ హీరో సోనూ సూద్ హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. నిరంజన్ మరణవార్త విన్న సోనూ సూద్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా నిరంజన్తో గడిపిన ఆత్మీయ క్షణాలను గుర్తుచేసుకుంటూ, అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ను షేర్ చేశారు.
నిరంజన్ తనను కలవడానికి వరంగల్ నుండి తన తల్లిదండ్రులతో కలిసి వచ్చాడని సోనూ సూద్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ప్రాణాంతక వ్యాధితో చావుబతుకుల మధ్య పోరాడుతున్నప్పటికీ, ఆ చిన్నారి ముఖంలో వెలిగిన చిరునవ్వు ఎంతో ప్రత్యేకమైనదని, ఆ నవ్వు ఏ గదినైనా కాంతితో నింపేయగలదని సోనూ సూద్ ఎంతో ఆవేదనతో రాసుకొచ్చారు. తనను కలవాలనేది నిరంజన్ కోరిక అయినప్పటికీ, తన జీవిత ప్రయాణంలో ఆ ధైర్యవంతుడైన చిన్నారిని కలవడం తనే ఒక అదృష్టంగా భావిస్తున్నానని సోనూ సూద్ పేర్కొన్నారు. ఈ రోజు ఆ ధైర్యవంతుడైన చిన్నారిని కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన ఎమోషనల్ అయ్యారు.
నిరంజన్ కుటుంబానికి ఈ ఊహించని, గుండె కోతను మిగిల్చిన నష్టాన్ని తట్టుకునే శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని సోనూ సూద్ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. "నా చిన్నారి స్నేహితుడా.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి, నీ అమాయకపు చిరునవ్వు నా హృదయంలో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది, ఓం శాంతి" అంటూ సోనూ సూద్ భావోద్వేగంగా స్పందించారు.
Sonu Sood, Niranjan, Emotional, Warangal, TeluguOne






