.webp)
సినీ పరిశ్రమలో మారుతున్న కాలంతో పాటు సినిమాల మేకింగ్ శైలి, కథాంశాలు కూడా పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వెండితెరపై ముద్దు సీన్లు చూపించాల్సి వస్తే రెండు పూలు ఒకదానికొకటి తాకుతున్నట్లుగా సింబాలిక్ గా చూపించేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నేరుగా బోల్డ్ సీన్స్, కాస్త డార్క్ షేడ్స్ ఉన్న సబ్జెక్ట్స్ ని డైరెక్టర్లు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కథలో బోల్డ్నెస్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగానే సినిమాలో ఉండే డైలాగులు, పాటల్లోని లిరిక్స్ కూడా మారడం సహజమని టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయని సునీత (Sunitha) స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత సినిమాల్లోని సాహిత్యంపై, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న విమర్శలపై ఆమె తాజాగా తనదైన శైలిలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజుల్లో వస్తున్న కొన్ని పాటల సాహిత్యంపై నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, ఆమె గత తరం సినిమాలను ఉదాహరణగా చూపిస్తూ నెటిజన్ల డబుల్ స్టాండర్డ్స్ ను గట్టిగా ప్రశ్నించారు. ఒకప్పుడు దిగ్గజ రచయిత వేటూరు సుందరరామ్మూర్తి గారు రాసిన పాటల్లో కానీ, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి కాలంలో వచ్చిన పాత సినిమాల్లో కానీ డబుల్ మీనింగ్ సాంగ్స్ లేవా అని సునీత ప్రశ్నించారు. ఆ కాలంలో వచ్చిన కొన్ని ఐటెం సాంగ్స్ ని ఈ తరం వారు ఒకసారి కూర్చొని ప్రశాంతంగా వింటే, అందులో ఎన్ని బూతులు ఉన్నాయో మీకే స్పష్టంగా అర్థమవుతుందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. సమాజంలో గతంలోనూ ఇటువంటి సాహిత్యం ఉందని, ఇప్పుడు కూడా ఉందని చెప్తూ తాను ఎవరికీ వకాలత్తు పుచ్చుకోవడం లేదని, ఎవరినీ సమర్థించడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. కాకపోతే అప్పట్లో ఒక అందమైన ప్యాకేజింగ్తో ఆ పదాలను కాస్త మరుగున పెట్టి చెప్పేవారని, ఇప్పుడున్న మేకర్స్ నేరుగా, పచ్చిగా చెప్తున్నారని, కేవలం చెప్పే విధానంలో మాత్రమే తేడా ఉందని సునీత విశ్లేషించారు.
ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీపై లేదా ఒక చిన్న విషయంపై ఇంత పెద్ద ఎత్తున వివాదం నడవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే అని సునీత అన్నారు. నెటిజన్లు ప్రతి చిన్న విషయాన్ని కావాలనే హైలైట్ చేస్తున్నారని, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా అనవసరపు పాయింట్లను పట్టుకుని పెద్ద పెద్ద వివాదాలుగా మారుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో లేదా ఇండస్ట్రీలో ఏ చిన్న సంఘటన జరిగినా, ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో తమ అభిప్రాయాన్ని చెప్పకపోతే ఏదో తప్పు జరిగిపోతుందనే భ్రమలో బతుకుతున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ప్రతి చోటా, ప్రతి విషయంపై తమ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని హితవు పలికారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, అనవసరంగా కామెంట్లు పెట్టడం వంటి అలవాట్లను మానేస్తే, ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, సమాజంలోనూ చూస్తున్న అనవసరపు గొడవలు, సోషల్ మీడియా ట్రోలింగ్స్ దానంతట అవే తగ్గిపోతాయని సింగర్ సునీత నెటిజన్లకు హితబోధ చేశారు.






