ENGLISH | TELUGU  

ఆ సెన్సేషనల్‌ మూవీకి సీక్వెల్‌.. బర్త్‌డే గిఫ్ట్ ప్రకటించిన సూపర్‌స్టార్‌!

on Dec 9, 2025

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌(Super star Rajinikanth) కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్స్‌ ఉన్నాయి. వాటిలో ‘వడయప్ప’(Vadayappa) చిత్రం ఒకటి. 1999లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘నరసింహ’ పేరుతో విడుదల చేశారు. తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని డిసెంబర్‌ 12న సూపర్‌స్టార్‌ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్‌ చేస్తున్నారు. 4కె డిజిటల్‌ ప్రింట్‌, డాల్బీ అట్మాస్‌ సౌండ్‌తో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. 

 

Also Read: వారణాసిలో ఐదు పాత్రల్లో మహేష్.. ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న

 

ఇప్పటివరకు టాప్‌ హీరోల సూపర్‌హిట్‌ మూవీస్‌ చాలా రీరిలీజ్‌ అయ్యాయి. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టాయి. అయితే ‘నరసింహ’ చిత్రానికి వాటిని మించే స్థాయి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఏ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో లేదు. అంతకుముందు ఈ సినిమాను చూసిన వాళ్లు విజువల్‌గా, ఆడియో పరంగా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఈ సినిమాను థియేటర్లలోనే చూడక తప్పదు. అలాగే ఇప్పటి జనరేషన్‌ ఈ సినిమాను అసలు చూసి ఉండదు కాబట్టి వాళ్ళంతా థియేటర్లకు తరలి వెళ్తారు. దాంతో సహజంగానే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. 

 

‘నరసింహ’ రీరిలీజ్‌ సందర్భంగా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కోలీవుడ్‌లో ఇది ఆసక్తికరమైన చర్చగా మారింది. అంతేకాదు, సీక్వెల్‌ ఎలా ఉండబోతోంది అనేది కూడా రజినీ వివరించారు. సీక్వెల్‌లో తన కంటే రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, కథ ఆమె చుట్టూనే తిరుగుందని తెలిపారు. 

 

Also Read: ప్రభాస్ క్షేమంగానే ఉన్నాడు.. క్లారిటీ ఇచ్చిన మారుతి 

 

ఈ చిత్రంలో రమ్యకృష్ణ చేసిన ఈ నెగెటివ్‌ క్యారెక్టర్‌ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ క్యారెక్టర్‌ను తను తప్ప మరొకరు చెయ్యలేరు అనే రేంజ్‌లో పెర్‌ఫార్మ్‌ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు రమ్యకృష్ణ. ‘నరసింహ’లో నీలాంబరి క్యారెక్టర్‌ చనిపోతుంది. మరి సీక్వెల్‌లో ఆ క్యారెక్టర్‌ మళ్లీ ఎలా వస్తుందనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే దీన్ని సీక్వెల్‌గా చేస్తున్నారా? లేక ప్రీక్వెల్‌గా ప్లాన్‌ చేశారా? లేక ఫ్లాష్‌బ్యాక్‌ ఆధారంగా కథను రెడీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 

 

ఇవన్నీ పక్కన పెడితే ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. ‘నరసింహ’లాంటి బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ చెయ్యాలంటే ఒక సమర్థవంతమైన డైరెక్టర్‌ కావాలి. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరో పక్క అసలు ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందా? లేక ‘నరసింహ’ రీరిలీజ్‌కు హైప్‌ తీసుకొచ్చేందుకు ఈ ప్రకటన చేశారా అనే సందేహం కూడా అందరిలో ఉంది. ఏది ఏమైనా ‘నరసింహ’ చిత్రం రీరిలీజ్‌ మాత్రం సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.