SSMB29 నుంచి ఔట్.. రాజమౌళితో గొడవలే కారణమా.. క్లారిటీ ఇచ్చిన సెంథిల్!
on Jul 15, 2025
దర్శకధీరుడు రాజమౌళి మెజారిటీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ వర్క్ చేస్తుంటాడు. దర్శకుడిగా రాజమౌళి ఇప్పటిదాకా 12 సినిమాలు చేస్తే.. అందులో 8 సినిమాలకు సెంథిలే డీఓపీ కావడం విశేషం. అలాంటిది ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రానికి సెంథిల్ వర్క్ చేయట్లేదు. దీంతో రాజమౌళి-సెంథిల్ మధ్య గొడవలు జరిగాయని, అందుకే సెంథిల్ ను పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ అంశంపై సెంథిల్ స్పందించారు.
జూనియర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ చేయకపోవడంపై సెంథిల్ స్పందించారు. "రాజమౌళి గారు వేరే సినిమాటోగ్రాఫర్ తో వర్క్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వేరే వాళ్ళతో వర్క్ చేశారు. మర్యాదరామన్నకి రామ్ ప్రసాద్ గారు, విక్రమార్కుడుకి సర్వేశ్ గారు పని చేశారు. అన్ని సినిమాలు కలిసి చేయాలని లేదు. కొన్ని సినిమాలకు కొత్తగా ట్రై చేయాలనుకుంటారు. అది చాలా సాధారణ విషయం. అందరూ ఊహించుకుంటున్నట్టు ఏమీ జరగలేదు." అని సెంథిల్ చెప్పుకొచ్చారు.
కాగా, 'బాహుబలి-1' విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల మూవీ టీం రీ యూనియన్ అయింది. ఆ రీ యూనియన్ కి సెంథిల్ కూడా వచ్చారు. దాంతోనే రాజమౌళి-సెంథిల్ మధ్య బాండింగ్ ఎప్పటిలాగే మంచిగా ఉందని క్లారిటీ వచ్చేసిందని చెప్పవచ్చు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
