చింతామణి నాటకాన్ని నిషేధించడం ఖచ్చితంగా తప్పే!
on Jan 25, 2022
ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ ఎంతో చరిత్ర ఉన్న చింతామణి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. తాజాగా ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యం చేసి ఆ రోగాన్ని పోగొట్టాలి కానీ మనిషిని చంపుకుంటామా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
"ఏపీలో చింతామణి నాటకాన్ని నిషేధించడం ఖచ్చితంగా తప్పే. ఎంత పెద్ద తప్పంటే.. దేవాలయంలో డస్ట్ ఎక్కువగా ఉంటే.. ఆ డస్ట్ ని క్లీన్ చేయకుండా, దేవాలయాన్ని కూల్చేసినంత తప్పు. అయితే కళాకారులకు, నాటకరంగానికి కీడు తలపెడదాం అని ప్రభుత్వం చేసిన పని అయితే కాదు ఇది. ఎందుకంటే.. కళాకారులకు, రంగస్థలానికి కీడు చేద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఎందుకు ఉంటుంది? అసలు ఈ తప్పు జరగడానికి మూలం ఏమిటనేది ఆలోచిద్దాం.
కాళ్ళకూరి నారాయణరావు గారనే ఓ మహానుభావుడు ఈ నాటకాన్ని రాశారు. అందులోని ప్రతి మాటా, ప్రతి పద్యం ఒక అద్భుతం. అంత గొప్ప నాటకాన్ని.. తర్వాత్తర్వాత కాళ్ళకూరి నారాయణరావు గారు రాయని బూతులను చొప్పించి.. ఆ నాటకాన్ని అపవిత్రం చేశారు. తప్పు కళాకారుల నుండే జరిగింది. అయితే దీనిని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. చింతామణి నాటకంలో చొప్పించబడ్డ బూతుల్ని తీసేసి.. నాటక ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలి. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాల్సిందిగా కోరుతున్నాను." అని బుర్రా సాయిమాధవ్ అన్నారు.