కోలీవుడ్ వెర్సటైల్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ క్రేజ్ ఉన్న సూర్య సినిమా అంటే మన ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అయితే ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు ఒక అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ గతంలో తెలుగు సినిమాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
వివరాల్లోకి వెళితే.. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆర్జే బాలాజీ టాలీవుడ్ మేకింగ్ స్టైల్ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. తెలుగు సినిమాల్లో అసలు లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్ల కోసమే సినిమాలు తీస్తారని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ‘వీరభద్రుడు’ సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో ఆ పాత వీడియో క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై టాలీవుడ్ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆర్జే బాలాజీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తాను రామ్ చరణ్కు పెద్ద అభిమానిని అని, తెలుగు హీరోలంటే గౌరవమని వేదికపై చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు ఎగతాళి చేసి, ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి మాట మారుస్తున్నారా? అని నెటిజన్లు ఆయనను నిలదీస్తున్నారు. మా సినిమాలను చిన్నచూపు చూసి, ఇప్పుడు కలెక్షన్ల కోసం వస్తారా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
సూర్య - త్రిష కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరూ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకున్నాయి. చాలా కాలం తర్వాత సూర్య ఒక కమర్షియల్ ఎంటర్టైనర్తో రావడం ఫ్యాన్స్కు ఖుషిని ఇస్తోంది. కానీ దర్శకుడి చుట్టూ ముసురుకున్న ఈ వివాదం సినిమా ఓపెనింగ్స్పై ఏమైనా ప్రభావం చూపుతుందా అన్నది ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సాధారణంగా తమిళ దర్శకులు టాలీవుడ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ బాలాజీ పాత వ్యాఖ్యలు ఇప్పుడు సినిమాకు మైనస్గా మారేలా కనిపిస్తున్నాయి. మే 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వీరభద్రుడు’ ఈ నెగిటివిటీని తట్టుకుని ఏ మేరకు నిలబడుతుందో చూడాలి. సూర్యకున్న స్టార్ పవర్ ఈ వివాదాన్ని పక్కకు నెట్టి సినిమాను గట్టెక్కిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.





