
'కాంతార' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి పేరు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మారుమోగిపోతోంది. ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్' (IFFM)లో రిషబ్ శెట్టికి అరుదైన ‘లీడర్షిప్ ఇన్ సినిమా’ (Leadership in Cinema) అవార్డు వరించింది. మన భారతీయ సంస్కృతిని, రూటెడ్ కథలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రపంచానికి పరిచయం చేసినందుకు గాను ఈ గౌరవాన్ని ఆయనకు అందిస్తున్నారు.
"కథ చెప్పడం అంటే కేవలం వినోదం పంచడం మాత్రమే కాదు, మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మనల్ని నడిపించే మట్టి మనుషుల కథలను వేడుకలా జరుపుకోవడం." అని రిషబ్ శెట్టి ఈ పురస్కారంపై స్పందిస్తూ చాలా భావోద్వేగంగా చెప్పారు. మెల్బోర్న్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమా దిగ్గజాల మధ్య భారతీయ సినిమా వైభవాన్ని వేడుకగా జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఫెస్టివల్ డైరెక్టర్ మిటూ భౌమిక్ లాంగే మాటల్లో చెప్పాలంటే.. "రిషబ్ శెట్టి కేవలం ఒక నటుడో, దర్శకుడో కాదు. ఆయన ఒక కొత్త తరం భారతీయ సినిమా రథసారథి. మన లోకల్ కథలతో గ్లోబల్ ఆడియన్స్ను ఏ విధంగా కట్టిపడేయాలో రిషబ్ నిరూపించారు. సరిహద్దులను చెరిపేస్తూ, ప్రపంచ వేదికలపై భారతీయ కథల సత్తాను చాటిచెప్పిన నిజమైన లీడర్ ఆయన." అన్నారు.
కాంతార' ప్రభంజనం తర్వాత రిషబ్ శెట్టి పలు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రాబోతున్న చారిత్రక దృశ్యకావ్యం 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమాలో టైటిల్ రోల్లో కనిపించబోతున్నారు. అలాగే 'హనుమాన్'కి సీక్వెల్ గా రానున్న 'జై హనుమాన్'లో హనుమంతుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. అంతేకాకూండా, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామాలోనూ నటించనున్నారు.
Rishab Shetty, Leadership in Cinema Award, IFFM Melbourne 2026





