ఆటో నుండి ఆడి కార్ వరకు.. రిషబ్ శెట్టి ఇన్స్పైరింగ్ జర్నీ
on Oct 6, 2025

హీరోగా కేవలం రెండే రెండు చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించడమంటే సామాన్యమైన విషయం కాదు. పైగా దర్శకుడుగా కూడా ఆ రెండు చిత్రాలతో ఇండియన్ సినిమా మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు రిషబ్ శెట్టి. ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా 'కాంతార చాప్టర్ 1 'తో తన రికార్డుల వేటని కొనసాగిస్తున్నాడు. బడా హీరోలు సైతం ఆశ్చర్యపోయే రీతిలో కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు. మూవీ చేసిన ప్రతి ఒక్కరు రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్సు కి మెస్మరైజ్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రిషబ్ శెట్టి గురించి చర్చ నడుస్తుంది.
రిషబ్ శెట్టి కి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు. స్వగ్రామం కర్ణాటకలోని 'కేరాడి' అనే ఒక మారుమూల గ్రామం. తండ్రి జాతకాలు చెప్తూ ఉండే వాడు. అదే వాళ్ళ జీవనాదారం. ఒక అక్క, అన్నయ్య ఉన్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాల మీద ఆసక్తిని పెంచుకున్నాడు. మరో వైపు కుటుంబ పోషణ కోసం వాటర్ క్యాన్స్ సప్లై చెయ్యడంతో పాటు . ఆటో నడిపేవాడు. హోటల్స్ లో కూడా పని చేసాడు. ఇవన్నీ చేస్తూనే సినిమా రంగంలో అవకాశాల కోసం ట్రై చేసే వాడు. అలా 2008 లో సినీ రంగ ప్రవేశం చేసి క్లాప్ బాయ్, స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని చిత్రాలకి పనిచేసాడు. ఆ సమయంలోనే హీరో గా ప్రయతిస్తున్న 'రక్షిత్ శెట్టి' తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఇలా కొన్నేళ్ల తర్వాత 2012 లో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన 'తుగ్లక్' అనే మూవీలో చిన్న క్యారక్టర్ ని పోషించాడు. 2016 లో రిక్కీ అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు .క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి హీరోగా చెయ్యగా, రిషబ్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి తోనే 'కిరాక్ పార్టీ' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. స్టార్ హీరోయిన్ రష్మిక ఈ చిత్రం ద్వారానే సినీ రంగ ప్రవేశం చేసింది. రొమాంటిక్ కామెడీ గా 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 50 కోట్లు వసూలు చేసింది.
దీంతో సౌత్ సినీ సర్కిల్స్ లో 'రిషబ్ శెట్టి' పేరు మారుమోగిపోయింది. ఇప్పటికి ఈ చిత్రంలోని సాంగ్స్ అన్ని కాలేజీ ఫంక్షన్స్ లో వినిపిస్తూనే ఉంటాయి. తెలుగులో నిఖిల్ ఈ చిత్రాన్ని రీమేక్ చేసాడు. ఆ తర్వాత ప్రముఖ హీరో 'అనంత్ నాగ్' తో ఒక చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకొని, తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని 'పంజర్లీ' దైవాన్ని నేపధ్యంగా చేసుకొని, భూమి కోసం పోరాటం చేసే యోధుడుగా 2022 లో 'కాంతార' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిషబ్ శెట్టి టేకింగ్, యాక్టింగ్ పాన్ ఇండియా ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. 16 కోట్ల రూపాయలతో తెరకెక్కి, 400 కోట్ల దాకా వసూలు చేసింది. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 తో ఫస్ట్ వీక్ పూర్తి కాకుండానే 325 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాడు. దీంతో రిషబ్ శెట్టి సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీకి పాన్ ఇండియా ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. చాప్టర్ 1 కి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. నిర్మాతగాను పలు చిత్రాలు నిర్మించిన రిషబ్ శెట్టి ప్రస్తుతం ఖరీదైన ఆడి కార్ లో తిరుగుతున్నాడు. ఈ విధంగా ఆటో నుండి ఆడి కార్ వరకు రిషబ్ శెట్టి జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



