
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.
ఇటీవల విజయవాడలో జరిగిన 'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఒక అద్భుతమైన జాతరను తలపించింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసందోహం మధ్య జరిగిన ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ ఈవెంట్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిమానుల ఎమోషనల్ కేకలు, చప్పట్లతో విజయవాడ ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది.
అయితే ఈ వేడుకలో స్టేజ్ పైకి వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ప్రొడ్యూసర్ సతీష్ కిలారుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో తాను పని చేసిన ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు కేవలం షూటింగ్ సెట్స్కి వచ్చి, కాసేపు కూర్చుని, టీ తాగి, భోజనం చేసి వెళ్లిపోయేవాళ్లని చరణ్ గుర్తు చేసుకున్నారు. కేవలం డబ్బులు పెట్టడమే కాకుండా సినిమాతో ట్రావెల్ అవ్వడం కొందరికే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కానీ తన 'పెద్ది' సినిమా నిర్మాత సతీష్ గారు మాత్రం ఆ రకం కాదని, ఆయన ప్రతి విషయంలో ఎంతో ప్యాషన్తో సినిమా వెంటే ఉండి నడిపించారని చరణ్ ఎంతో ఎమోషనల్గా ప్రశంసించారు. సినిమా నిర్మాణంలో ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటూ, దర్శకుడి విజన్కు ఎక్కడా రాజీ పడకుండా సతీష్ గారు సపోర్ట్ ఇచ్చారని చరణ్ కొనియాడారు. సతీష్ గారు ఇది మొదటి సినిమాలా చేయలేదని, 50 సినిమాలు తీసిన నిర్మాతలా చేశారని అన్నారు. ప్రతిరోజూ సెట్స్ కి వచ్చి 8-9 గంటలు టీంతోనే ఉండేవారని చరణ్ చెప్పారు.
పెద్ది ప్రొడ్యూసర్ సతీష్ పై ప్రశంసలు కురిపించే క్రమంలో.. ఒకరిద్దరు నిర్మాతలు సెట్స్ కి వచ్చి టీ తాగి, భోజనం చేసి వెళ్లిపోయేవారని చరణ్ అనడం కొత్త చర్చకు దారితీసింది. ఇంతకీ ఆ నిర్మాతలు ఎవరై ఉంటారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.






