Home

»

Latest News

మెగాస్టార్ క్లాప్‌తో స్టార్ట్ అయిన రామ్ చ‌ర‌ణ్ సినిమా ఆగిపోయింది.. అస‌లేం జ‌రిగింది?

Apr 28, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటుతున్నారు. 'మగధీర'తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన చరణ్, ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయారు. అయితే మెగా అభిమానులు ఇప్పటికీ ఒక విషయంలో మాత్రం చిన్న అసంతృప్తితో ఉంటారు. అదే చరణ్ కెరీర్‌లో ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్ 'మెరుపు'. భారీ అంచనాలతో ప్రారంభమై, షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా ఎందుకు మధ్యలోనే నిలిచిపోయిందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు.

ఈ సినిమా 2010లో ప్రారంభమైంది. తమిళంలో 'గిల్లి' (తెలుగు 'ఒక్కడు' రీమేక్), 'ధూల్' వంటి మాస్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ధరణి ఈ చిత్రానికి దర్శకుడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దీనిని ప్లాన్ చేశారు. సూపర్‌ గుడ్ ఫిలిమ్స్‌ పతాకంపై ఆర్.బి. చౌదరి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు పూనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లాప్ కొట్టి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. కానీ కేవలం 15 రోజుల షూటింగ్ తర్వాత ఈ సినిమా అనూహ్యంగా ఆగిపోయింది.

సినిమా ఆగిపోవడానికి ప్రధానంగా బడ్జెట్ లెక్కలు తలకిందులు కావడమే కారణమని తెలుస్తోంది. అప్పట్లోనే ఈ సినిమాకు దాదాపు 35 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ డైరెక్టర్ విజన్ ప్రకారం చూస్తే అది 45 కోట్లకు చేరేలా కనిపించింది. కేవలం మొదటి 15 రోజుల షూటింగ్‌కే దాదాపు 8 కోట్ల వరకు ఖర్చు అవ్వడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ కాలంలో ఇది చాలా పెద్ద మొత్తం కావడంతో నిర్మాత ఆర్.బి. చౌదరి వెనకడుగు వేశారు.

మరోవైపు, షూటింగ్ జరిగిన రష్‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవికి కూడా అవుట్‌పుట్ అంతగా నచ్చలేదని టాక్. కథలో మార్పులు చేయాలని సూచించినప్పటికీ, అప్పటికే బడ్జెట్ పరిమితులు దాటిపోవడంతో రిస్క్ చేయడం ఎందుకని భావించి సినిమాను ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా మొదట షాజన్ పదాంసి, ఆ తర్వాత కాజల్, ఇలియానా పేర్లు వినిపించాయి. రామ్ చరణ్‌కు కోచ్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించాల్సి ఉండటం విశేషం.

'మగధీర' వంటి భారీ విజయం తర్వాత చరణ్ నుంచి ఒక స్పోర్ట్స్ సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. ఈ సినిమా కోసం చరణ్ తన బాడీని కూడా మౌల్డ్ చేసుకున్నారు. కానీ పరిస్థితులు సహకరించకపోవడంతో 'మెరుపు' కాస్తా 'రచ్చ'గా మారింది. మెరుపును పక్కన పెట్టి అదే బ్యానర్‌లో చరణ్ 'రచ్చ' సినిమాను పూర్తి చేశారు. అప్పట్లో ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పోస్టర్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com