Home

»

Latest News

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి కన్నుమూత

May 05, 2026

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో అగ్ర నిర్మాతగా పేరుగాంచిన, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆర్‌బీ చౌదరి మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆర్‌బీ చౌదరి తన వ్యక్తిగత పనుల నిమిత్తం రాజస్థాన్ పర్యటనకు వెళ్లారు. ఉదయ్‌పూర్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ త‌ప్పి ప్ర‌మాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఆర్.బి. చౌదరి మరణ వార్త సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలను అందించిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. 

రాజస్థాన్‌కు చెందిన కుటుంబంలో జన్మించిన ఆర్‌.బి.చౌదరి, వ్యాపార రంగం నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మొదట మలయాళ చిత్రాలతో తన నిర్మాణ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత చెన్నై కేంద్రంగా 'సూపర్ గుడ్ ఫిల్మ్స్' బ్యానర్‌ను స్థాపించారు.  'పుదు వసంతం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగులో కూడా ఆయన నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా, కొత్త దర్శకులకు మరియు నటీనటులకు అవకాశం ఇవ్వడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో 100కు పైగా  సినిమాలు నిర్మించారు. 

రాజా, సూర్యవంశం, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, సంక్రాంతి, ర‌చ్చ వంటి ఎన్నో గొప్ప చిత్రాలు ఆర్‌.బి.చౌద‌రి నిర్మించారు. ఆయన కుమారులు జీవా, జితన్ రమేష్ హీరోలుగా రాణిస్తున్నారు. మరో కుమారుడు బి. సురేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్‌.బి.చౌద‌రి మృతి ప‌ట్ల చిత్ర ప‌రిశ్ర‌మలోని ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని తెలియ‌జేస్తూ ఆయ‌న‌ మ‌ర‌ణం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని వ్యాఖ్యానిస్తున్నారు.  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com