
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం థియేటర్ల ఆదాయం, ఎగ్జిబిటర్ల సమస్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ (Bunny Vas) సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. కేవలం పర్సంటేజీల గురించి కొట్టుకోవడం కంటే, అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదనే ప్రధాన సమస్యను గుర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. (Producers vs Exhibitors)
వందల కోట్ల కలెక్షన్ల వెనుక అసలు నిజం
వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయని మనం సంబరపడుతున్నాం కానీ.. అది ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చింది కాదని, టికెట్ రేట్లు పెరగడం వల్ల వచ్చిందని బన్నీ వాస్ స్పష్టం చేశారు. సగటు ప్రేక్షకుడు థియేటర్కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్దిమంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదని ఆయన విమర్శించారు. చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని, ఉన్న అరకొర ఆదాయంలో వాటాల కోసం పోరాడటం కంటే వ్యవస్థను బాగు చేయడం ముఖ్యమని సూచించారు.
ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణాలివే!
బన్నీ వాస్ తన విశ్లేషణలో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సంక్షోభానికి నాలుగు ప్రధాన కారణాలను వెల్లడించారు.
హీరోలు: మన టాలీవుడ్ లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేది హీరోలే. అలాంటిది హీరోలు ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్లు సమయం తీసుకుంటే ప్రేక్షకుల్లో సినిమాలపై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
OTT రిలీజ్: సినిమాలు విడుదలైన కేవలం 27 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో, సగటు ప్రేక్షకుడు థియేటర్ కు రావడానికి ఆసక్తి చూపడం లేదు.
కంటెంట్ నాణ్యత: ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
క్యాంటీన్ ధరలు: మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లతో పాటు క్యాంటీన్లలో తినుబండారాల ధరలు సామాన్యుడికి భారంగా మారడం థియేటర్ల విముఖతకు ఒక కారణం.
"ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది?" అని బన్నీ వాస్ ప్రశ్నించారు.
బన్నీ వాస్ లేవనెత్తిన ఈ అంశాలు అటు నిర్మాతలను, ఇటు ఎగ్జిబిటర్లను ఆలోచనలో పడేసేలా ఉన్నాయి. సమస్య మూలాల్లో ఉందని, దాన్ని సరిచేయకుండా కేవలం వాటాల కోసం వాదించుకోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. మరి ఇండస్ట్రీ పెద్దలు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.






