
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన అప్డేట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి. ఈ భారీ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండటం విశేషం. ఇందులో ఆమె 'మందాకిని' అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను గత 14 నెలలుగా ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నానని ఆమె వెల్లడించారు. రాజమౌళి సినిమాలంటే ఎంత సమయం తీసుకుంటారో, ప్రతి సన్నివేశాన్ని ఎంత క్షుణ్ణంగా, పరిపూర్ణంగా మలుస్తారో అందరికీ తెలిసిందే అని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను అద్భుతమైన స్లో మోషన్ జంప్ సన్నివేశాల్లో నటించానని, దీని గురించి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేనని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఇప్పటివరకు చేసిన ఇతర సినిమాలతో పోలిస్తే, ఈ 'వారణాసి' చిత్రం పూర్తిగా భిన్నమైనదని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే, ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణను రాజమౌళి పూర్తి చేసినట్లు సమాచారం. రాబోయే అక్టోబర్ నాటికి సినిమా మొత్తం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. షూటింగ్ పూర్తయ్యాక వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
Priyanka Chopra, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli






