
ప్రకాష్ రాజ్.. ఏ క్యారక్టర్ లోకైనా పరకాయ ప్రవేశం చేసి సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడే చేయగల కళామతల్లి ముద్దుబిడ్డ. అటువంటి ప్రకాష్ రాజ్ పేరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని 'ధర్మస్థల' సామూహిక ఖననం కేసులో తెరపైకి రావడం చిత్ర పరిశ్రమతో పాటు ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చిన్నయ్య అనే వ్యక్తి జూన్ 11న కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్లో ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారని, ధర్మస్థల క్షేత్రాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు కొందరు వ్యక్తులు పన్నిన 200 కోట్ల భారీ కుట్రలో భాగంగా తనపై ఒత్తిడి తెచ్చి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారని ఆరోపించాడు. అంతేకాకుండా, నువ్వేం భయపడకు, జూలై 29న నేనే స్వయంగా వచ్చి నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాను అంటూ ప్రకాష్ రాజ్ తనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారంటూ చిన్నయ్య కోర్టుకి తెలపడం తీవ్ర సంచలనంగా మారింది.
ఈ ఆరోపణలు బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ని టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ధర్మస్థల కేసు గురించి నన్ను ముడిపెడుతూ వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఇది కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో, విశ్వాసాలతో ముడిపడిన అత్యంత సున్నితమైన అంశం. దీనిపై స్పందించి నిజానిజాలు తెలియజేయడం నా కనీస బాధ్యత. మరో రెండు రోజుల్లో నేనే స్వయంగా అందరి ముందుకు వచ్చి, ప్రెస్ మీట్ పెట్టి పూర్తి నిజాలని తెలియచేస్తాను. అంతవరకు కొందరు వెధవలు ఈ వార్తలకి జోడిస్తున్న అబద్ధపు రెక్కలని, పుకార్లని ఎవరూ నమ్మవద్దంటూ ట్వీట్ చేసాడు.
Also read:sing geetham: సింగ్ గీతం హైలెట్స్ ఇవే
ధర్మస్థల కేసు వెనుక ఉన్న గతాన్ని పరిశీలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 1995 నుండి 2014 మధ్య కాలంలో అంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు అత్యాచారాలు, దారుణ హత్యలకు గురైన వందలాది మంది మహిళలు, పాఠశాల పిల్లల మృతదేహాలని బలవంతంగా పూడ్చిపెట్టేలా నాటి యాజమాన్యం నన్ను వేధించిందంటూ అప్పట్లో ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో 2025లో ఈ దారుణం మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT)ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం రంగంలోకి దిగి సదరు కార్మికుడు చూపించిన కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా అస్థిపంజరాలు బయటపడటం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే, స్థానిక పంచాయతీ అధికారులు మాత్రం అవి గుర్తుతెలియని అనాథ శవాలని వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో రూ. 200 కోట్ల కుట్ర కోణం,ప్రకాష్ రాజ్ పేరు రావడంపై నిన్న 11న విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ఏకసభ్య బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సిట్ (SIT) అధికారులకి నోటీసులు జారీ చేశారు. ఈ విచారణను జూలై 29 వరకు వాయిదా వేస్తూ, దర్యాప్తు పురోగతిపై పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. మరి రెండు రోజుల్లో ప్రకాష్ రాజ్ నిర్వహించబోయే ప్రెస్ మీట్లో ఎలాంటి నిజాలు బయటపడతాయో అని ఇటు సినీ లోకం ఎదురుచూస్తుంది.





