"మీరసలు మనిషేనా?" బాలయ్యకు ప్రగ్యా సూటి ప్రశ్న!
on Nov 26, 2021
"అఖండ లాంటి కథ, అలాంటి కారెక్టర్ నేను ఇంత వరకు చూడలేదు. ఇక్కడే అని కాదు, వేరే ఏ భాషలోనూ అలాంటి పవర్ ఫుల్ రోల్ను నేను చూడలేదు. బాలకృష్ణ గారు ఆ పాత్రలో వేరే లెవెల్లో కనిపిస్తారు. ఉదయాన్నే మూడు గంటలకు లేస్తారు.. ఆరు గంటలకే సెట్కు వస్తారు.. రోజంతా షూటింగ్ చేస్తారు.. మీరసలు మనిషేనా? అని అడిగేశాను. బాలకృష్ణ గారు అంత పవర్ ఫుల్ వ్యక్తి కావడంతోనే బోయపాటి గారు అఖండ లాంటి పాత్రను రాశారేమో." అని చెప్పింది ప్రగ్యా జైస్వాల్. డిసెంబర్ 2న విడుదలవుతున్న 'అఖండ' మూవీలో బాలకృష్ణ జోడీగా నటించారామె. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమా గురించీ, అందులో తను పోషించిన రోల్ గురించీ మీడియాతో సంభాషణ సందర్భంగా ఆమె వెల్లడించింది.
"బాలకృష్ణ గారు చాలా సీనియర్. అంత పెద్ద హీరోతో నేను ఇది వరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనది టైం అంటే టైం. ఇది వరకు ఆయన రెండు మూడు సార్లు కలిశాను. కానీ ఆయనతో మొదటి రోజు పని చేస్తున్నాని తెలియడంతో ఎంతో నర్వస్గా ఫీలయ్యాను. కానీ కలిసిన ఐదు నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్గా ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్ను నేను ఇంత వరకు చూడలేదు. ఆయన అలా నడిచి వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్ అవుతుంది. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయన గ్రేట్. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను." అని తెలిపింది ప్రగ్య.
ఆమె 'అఖండ'లో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను చేసింది. "ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఇది వరకు చూసిన ప్రగ్యా కనిపించొద్దని బోయపాటి గారు అన్నారు. ఆ పాత్రను పోషించేందుకు చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను." అని చెప్పింది. ఆమెకు బోయపాటి మీద చాలా నమ్మకం ఉంది. "ఆయన ఒక పాత్ర కోసం ఒకరిని అనుకున్నారంటే అది కచ్చితంగా పర్ ఫెక్ట్ చాయిస్లా ఉంటుంది. ఆయన ఎంతో ఆలోచించి గానీ ఒక పాత్రకు ఆర్టిస్ట్ను ఎంచుకోరు. ఆయనకు ఎలాంటి వారు కావాలి.. సినిమాను ఎలా తీయాలి అనేది బాగా తెలుసు. అందుకే ఈ సినిమా కోసం నన్ను అడిగినప్పుడు మొత్తం కథ వినకుండానే ఓకే చెప్పాను. నాకు ఆయన మీద ఆ నమ్మకం ఉంది." అనేది ఆమె మాట.
'అఖండ' చిత్రంలో తనది చాలా ముఖ్యమైన పాత్ర అని ఆమె అంటోంది. "ఆ కారెక్టర్ చుట్టే కథ తిరుగుతుంది. నాకు ఎదురైన సంఘటనల వల్లే రెండో పాత్ర అయిన అఖండ ఎంట్రీ ఉంటుంది. అలా ఈ సినిమాలో నాకు నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న కారెక్టర్ దక్కింది." అని ఆమె వెల్లడించింది.
Also Read