
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితో కలిసి నటించిన అనుభవం ఉంది. అయితే, ప్రతి హీరోకి సంబంధించిన జ్ఞాపకాలు ఆమె మనసులో ఒక్కో రకంగా ముద్రపడిపోయాయి. తాజాగా తన చిట్ చాట్ సందర్భంగా మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ గురించి ఆమె ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వైరల్గా మారాయి.
ముఖ్యంగా ప్రభాస్ గురించి అడగగానే, పూజాకు వెంటనే గుర్తొచ్చేది ఆయన పంపే భోజనం డబ్బా అని ఆమె సరదాగా చెప్పింది. "ప్రభాస్ పేరు చెప్పగానే నాకు భోజనం గుర్తొస్తుంది. ఆయన కుక్(వంటమనిషి)ని దొంగిలించాలనిపిస్తుంది" అని ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించింది. 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ తో కలిసి పనిచేసిన ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఆయన తనకు ఎంతో ఫుడ్ తినిపించారని, ఆ రుచికరమైన భోజనం ఎప్పుడూ గుర్తుంటుందని పేర్కొంది.
ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, ఆయన సెట్స్లో చాలా సరదాగా ఉంటారని తెలిపింది. మహేష్ ఎప్పుడూ జోకులు వేస్తూ, చుట్టూ ఉన్నవారిని సెటైర్లతో నవ్విస్తుంటారని, అందుకే ఆయన పేరు వినగానే ఆ జోకులు, సరదా వాతావరణమే ముందుగా గుర్తొస్తాయని వివరించింది.
అల్లు అర్జున్ గురించి చెబుతూ, ఆయన ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన 'శ్వాగ్' (Swag) మెయింటైన్ చేస్తారని, అలా ప్రతిక్షణం స్టైలిష్గా ఉండటం నిజంగా కష్టమని పూజా అభిప్రాయపడింది.
ఇక స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే, ఆయనకు పని పట్ల ఉన్న అంకితభావాన్ని చూసి తాను ముగ్ధురాలినని, రామ్ చరణ్ ఎప్పుడూ ఎంతో కష్టపడే స్వభావం కలవారని కితాబిచ్చింది.
ప్రస్తుతం పూజా హెగ్డే ఒక భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. దళపతి విజయ్ తో కలిసి ఆమె నటించిన 'జన నాయగన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే లారెన్స్ తో 'కాంచన 4', దుల్కర్ సల్మాన్ తో 'శ్రీ శ్రీ' వంటి సినిమాలు చేస్తోంది.
Pooja Hegde, Prabhas, Allu Arjun, Mahesh Babu, Ram Charan






