భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ దిగ్గజాలు, అగ్ర కథానాయకులు ప్రధానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలను కొనియాడారు.
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ అక్కినేని నాగార్జున తదితర ప్రముఖులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ ప్రజాసేవను, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రశంసించారు.
మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ .. నవభారత నిర్మాణంలో ప్రధాని చూపుతున్న క్రమశిక్షణ, దూరదృష్టి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ దిశగా నడిపిస్తున్న ఆయనకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్ సుదీర్ఘ సందేశాన్ని ఇస్తూ.. గత పాతిక సంవత్సరాలుగా ప్రజాసేవకే అంకితమైన మోదీ నాయకత్వం ఎంతో ఆదర్శవంతమైనదని కొనియాడారు. భారత ప్రాభవాన్ని ప్రపంచ స్థాయిలో పెంపొందించడంలో ప్రధాని కృషి అపూర్వమని పవన్ విష్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్లో స్పందిస్తూ.. "ఎప్పుడూ విశ్రమించకుండా, నిరంతరం దేశ సంక్షేమమే పరమావధిగా శ్రమించే మహోన్నత నాయకుడు ప్రధాని మోదీ" అని కొనియాడారు. ఆయన స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో నిండుగా ఉందని విష్ చేశారు.
కింగ్ అక్కినేని నాగార్జున సైతం ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, దేశాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి ఆయనకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీకి టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఈ పోస్టులను రీట్వీట్ చేస్తూ ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.





