'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పోస్టర్పై పవన్ కల్యాణ్!
on Oct 24, 2019
'లక్ష్మీస్ ఎన్టీఆర్' వంటి కాంట్రవర్షియల్ మూవీ తర్వాత రాంగోపాల్ వర్మ తీస్తున్న తాజా తాజా కాంట్రవర్షియల్ మూవీ 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 27న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తానంటూ బుధవారం సాయంత్రం తన ట్విట్టర్ పేజీలో వర్మ పోస్ట్ చేసిన పోస్టర్ సంచలనం సృష్టించింది. కొద్ది రోజుల క్రితం ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే ఏపీలో సంచలనం రేగింది.
ఏపీలోని రెండు అగ్ర కులాలను డైరెక్టుగా ఉటంకించడమే కాకుండా, కమ్మవాళ్ల మీద రెడ్లు ఆధిపత్యం చూపారన్నట్లుగా ఆ టైటిల్ తెలియజేస్తుండటంతో ఒక వర్గంవాళ్లు గోల చేస్తూ వస్తున్నారు. టైటిల్ను బట్టి ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి వేసీపీ అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని ప్రధానంగా తీసుకొని రాంగోపాల్ వర్మ ఈ మూవీని తీస్తున్నాడనేది స్పష్టం. ఏ కారణం చేతనో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని వర్మ టార్గెట్ చేస్తున్నట్లు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో స్పష్టమైంది. దాన్ని 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో కంటిన్యూ చేస్తున్నాడు వర్మ.
బుధవారం వర్మ రిలీజ్ చేసిన పోస్టర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు.. చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, నారా రోహిత్, కేఏ పాల్..లను ప్రతిబింబించే పాత్రలు కనిపిస్తున్నాయి. అంతే కాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను పోలిన పాత్ర సైతం ఈ పోస్టర్లో ప్రత్యక్షమవడంతో ఆయన ఫ్యాన్స్, జనసైనికులు గగ్గోలు పెడుతున్నారు. నోటికి చేయి అడ్డం పెట్టుకున్నట్లు ఉన్న పవన్ కల్యాణ్ కేరెక్టర్లో ఒక అనామక నటుడు కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ను వర్మ విడుదల చేసిన వెంటనే పవన్ ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు. పవన్ను తప్పుగా చూపిస్తే ఊరుకొనేది లేదని వర్మకు వార్నింగ్ మెసేజ్లు ఇస్తున్నారు. ఆగస్టు నెలలోనే, పవన్ కల్యాణ్లా కనిపిస్తోన్న నటుడి ఫొటోను షేర్ చేసి, "కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీలో ఈ కొత్త నటుడు చేస్తోన్న రోల్ ఏమిటనేది ఎవరైనా ఊహించగలరా?" అంటూ టీజ్ చేశాడు. ఆ వెంటనే సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్ అయ్యింది.
ఎన్నికలకు ముందు చంద్రబాబునే కాకుండా పవన్ను టార్గెట్ చేస్తూ కూడా వర్మ కామెంట్లు చెయ్యడం మనకు తెలుసు. పవన్ను కించపరిచే రీతిలో ఆర్జీవీ చేసిన ట్వీట్లు, కామెంట్లు దుమారం సృష్టించాయి. శ్రీరెడ్డి ఉదంతంలో ఆమెను సపోర్ట్ చేస్తూ, పవన్పై వర్మ చేసిన ట్వీట్లు ఆయన ఫ్యాన్స్కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఆ సందర్భంలో వర్మను వారు విపరీతంగా ట్రోల్ చేశారు.
'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' మూవీని "ఇట్స్ ఎ నాన్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ విత్ కాంట్రవర్షియల్ కేరెక్టర్స్" అంటూ తన స్టైల్లో అభివర్ణించాడు వర్మ. ఆ పోస్టర్కు వచ్చిన రెస్పాన్స్ను చూసి గురువారం మరో పోస్టర్తో పాటు మరో కామెంట్ పోస్ట్ చేశాడు. "నిజ జీవితంలోని కొంతమందిని ఈ పోస్టర్లోని కొంతమంది పోలివుండటం కేవలం యాదృచ్ఛికమే తప్ప, ఉద్దేశపూర్వకమైంది కాదు" అని పేర్కొన్నాడు. చంద్రబాబు పాత్రధారి అచ్చు గుద్దినట్లు ఆయనలా అనిపిస్తుండగా, మిగతావాళ్లు అలా లేకపోయినా, వాళ్ల ఆహార్యాన్ని బట్టి, వాళ్లు ఏ పాత్రల్ని చేస్తున్నారో స్పష్టమవుతోంది. జగన్మోహనరెడ్డి కేరెక్టర్ను తమిళ డబ్బింగ్ ఫిల్మ్ 'రంగం'లో విలన్గా నటించిన అజ్మల్ అమీర్ చేస్తున్నాడు. అతను తెలుగులో ఇప్పటికే 'రచ్చ', 'ప్రభంజనం', 'వెన్నెల్లో హాయ్ హాయ్' సినిమాల్లో నటించాడు. పవన్ కల్యాణ్, నారా రోహిత్ పాత్రధారులెవరనేదీ తెలీడం లేదు. కేఏ పాల్ రోల్లో జబర్దస్త్ రాము కనిపించనున్నాడు.
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' మూవీకి సంబంధించి ఆగస్టులో తొలి పాటను రిలీజ్ చేసిన వర్మ, ఇప్పుడు దీపావళికి ట్రైలర్ను రిలీజ్ చేస్తూ తెలుగునాట కాక పుట్టించబోతున్నాడు. ట్రైలర్ రిలీజ్ అంటే సినిమా సైతం రిలీజ్కు రెడీ అవుతున్నట్లే లెక్క. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీని పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు ఈ తాజా సినినిమాను పట్టించుకుంటారా?.. వేచి చూద్దాం.