
గత కొంతకాలంగా రెండు భుజాలకు సంబంధించిన 'రొటేటర్ కఫ్' సమస్యతో ఇబ్బంది పడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుని బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. రాజకీయ కార్యక్రమాలు, సినిమా షూటింగ్లతో నిరంతరం బిజీగా ఉండటం వల్ల ఈ సమస్య తీవ్రమైందని తెలుస్తోంది. చివరకు వైద్యుల సలహా మేరకు ఈ నెల 10న ఆయన ఆసుపత్రిలో చేరారు.
నిపుణులైన వైద్యుల బృందం దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి, పవన్ కుడి భుజానికి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఆపరేషన్ అనంతరం నాలుగు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో బుధవారం ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. అయితే, కోలుకోవడానికి మరికొన్ని వారాల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని, ఫిజియోథెరపీతో పాటు వైద్యులు సూచించిన చికిత్సను ఖచ్చితంగా పాటించాలని వైద్యులు స్పష్టం చేశారు.
కుడి భుజం పూర్తిగా కోలుకున్న తర్వాత, మరో రెండు నెలల అనంతరం ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ భుజానికి సంబంధించిన ఈ గాయాలు 2016 నుంచే ఉన్నాయి. గత పదేళ్లుగా రాజకీయ కార్యక్రమాలు, సినిమా షూటింగ్ల ఒత్తిడి కారణంగా ఈ సమస్య తీవ్రమైంది.
పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ముంబై వెళ్లి ఆయన్ని పరామర్శించడం విశేషం. సీఎం పరామర్శకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
AP Deputy CM, Pawan Kalyan, Surgery, Discharge, Health Update






