సినిమా అంటేనే చిత్ర విచిత్రాలతో కూడుకున్న మాధ్యమం. భారీ బడ్జెట్తో తీసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. అదే సమయంలో తక్కు వ బడ్జెట్తో చేసిన కొన్ని సినిమాను సూపర్హిట్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. సినిమా అనేది ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి అరుదైన సంఘటనలు చాలా సందర్భాల్లో జరిగాయి.
ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటివరకు జరగని ఒక విచిత్రమైన విషయం చైనాలో నిర్మించిన ఒక యానిమేషన్ సినిమాకు జరిగింది. ఎలాంటి ప్రచారం లేకుండా, చాలా తక్కువ ఖర్చుతో రూపొంది, ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది చైనా భాషలో రూపొందిన నియు లై.
86 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రచార చిత్రాలు, ట్రైలర్లు ఏవీ లేకుండా విడుదలైన ఈ సినిమా, ఆ తర్వాత సోషల్ మీడియా ధాటికి ఏకంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
చైనాకు చెందిన తల్లి, కుమారుడు జిన్ యుమెంగ్, సన్ లీఫాంగ్ అనే ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ చిత్రాన్ని సుమారు రూ.1 లక్ష బడ్జెట్తో రూపొందించడం విశేషం. పాత సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లను ఉపయోగించి ఐదేళ్ల పాటు శ్రమించి ఈ యానిమేషన్ చిత్రాన్ని సిద్ధం చేశారు.
ఓ చిన్న దూడ, స్కైలార్క్ పక్షి మధ్య జరిగే కథతో ఇది తెరకెక్కింది. ఆగస్టు ప్రారంభంలో థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. మొదటి పది రోజుల్లో కేవలం రూ.1 లక్ష మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే సోషల్ మీడియాలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల మొత్తం సీన్ మారిపోయింది.
సినిమాలోని అత్యంత నాసిరకం గ్రాఫిక్స్, అసంపూర్ణ వాయిస్ ఓవర్లు, పాత్రల డిజైనింగ్ను నెటిజన్లు మీమ్స్ రూపంలో విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దాంతో అసలు "ఈ సినిమా ఎంత చెత్తగా ఉందో మనమే వెళ్లి చూడాలి" అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. నెటిజన్లు చూపించిన ఈ నెగటివ్ క్యూరియాసిటీయే ఈ చిత్రానికి ఊహించని పబ్లిసిటీగా మారింది.
ప్రేక్షకులు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేసి థియేటర్లకు క్యూ కట్టడంతో ఇప్పటివరకు 15 మిలియన్ యువాన్లకు పైగా అంటే భారత కరెన్సీ ప్రకారం 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. నెగటివ్ పబ్లిసిటీ కూడా కొన్నిసార్లు కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనడానికి ఈ 'నియు లై' చిత్రం ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.






