
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu), కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా వీరిద్దరూ ప్రాణస్నేహితులుగా కొనసాగుతున్నారు. తాజాగా మోహన్ బాబు ఒక వేదికపై రజనీకాంత్ గురించి చెబుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ తనకు ఫోన్ చేసి మరీ తిట్టారని ఆయన సరదాగా గుర్తు చేసుకున్నారు.
ఒకరోజు మోహన్ బాబుకు రజనీకాంత్ ఫోన్ చేశారట. "నువ్వు వెంటనే బెంగళూరుకు రా" అని కోరినట్లు మోహన్ బాబు తెలిపారు. దానికి మోహన్ బాబు స్పందిస్తూ.. "ఎందుకు రావాలి? ఎక్కడికి రావాలి?" అని అడిగారట. అప్పుడు రజనీకాంత్ తాను శ్రీశ్రీ రవిశంకర్ గురుదేవ్ గారి ఆశ్రమంలో ఉన్నానని, నువ్వు కూడా రా అని చెప్పారట.
మోహన్ బాబు మొదట్లో వెళ్ళడానికి నిరాకరించినట్లు చెప్పుకొచ్చారు. రజనీకాంత్ మాత్రం.. "నువ్వు నీ భార్యను తీసుకుని ఇక్కడికి రా.. గురువు గారి దగ్గరకు రా" అని పట్టుబట్టారట. దానికి మోహన్ బాబు.. "ఎవరా గురువు? ఆయన ఎవరికి గురువు? నేను రాను" అని సమాధానం ఇచ్చారట. ఆ మాట వినగానే రజనీకాంత్ కోపం తెచ్చుకుని, మోహన్ బాబును ఫోన్ లోనే తిట్టారని ఆయన నవ్వుతూ వెల్లడించారు.
రజనీకాంత్ తిట్టినా అది స్నేహంతో కూడిన కోపం మాత్రమేనని మోహన్ బాబు మాటల ద్వారా అర్థమవుతోంది. రజనీకాంత్ ఆధ్యాత్మికతను ఎంతగా నమ్ముతారో అందరికీ తెలిసిందే. తన స్నేహితుడు కూడా ఆ ప్రశాంతతను పొందాలనే ఉద్దేశంతోనే ఆయన అంతగా ఒత్తిడి చేశారని స్పష్టమవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ బాండింగ్ చూసి అభిమానులు ఎంతో ముచ్చటపడుతున్నారు.
మరిన్ని ఆసక్తికర వీడియోలు, సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.





