
టాలీవుడ్లో ఒకప్పుడు వరుస బ్లాక్బస్టర్లతో 'సంక్రాంతి రాజు'గా పేరు తెచ్చుకున్న స్టార్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రాజు (MS Raju) తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్, కోడి రామకృష్ణ కాంబినేషన్లో తాను నిర్మించిన విజువల్ వండర్ ‘దేవిపుత్రుడు’ (Devi Putrudu) సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి గల అసలు కారణాలను ఆయన ఓపెన్గా ఒప్పుకున్నారు. ఆ సినిమా ఫ్లాప్కు పూర్తి బాధ్యత తనదేనని ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.
'దేవి' సినిమా భారీ విజయం తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా 'దేవిపుత్రుడు' సినిమాను ప్రారంభించామని ఎంఎస్ రాజు గుర్తుచేసుకున్నారు. కథ వినగానే వెంకటేష్ ఈ ప్రాజెక్ట్కు ఓకే చెప్పారని, అయితే క్లైమాక్స్కు ముందు వచ్చే లాస్ట్ 45 నిమిషాల స్క్రిప్ట్ను పక్కాగా ఫినిష్ చేయమని వెంకటేష్ ముందే హెచ్చరించారని తెలిపారు. కానీ, షూటింగ్ జరుగుతున్న కొద్దీ సీన్లు అల్లుకుంటూ వెళ్లే అలవాటు వల్ల, తాను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఎంఎస్ రాజు అన్నారు.
చివరికి వచ్చేసరికి వెంకటేష్ భయపడిందే జరిగిందని, ఎంత ప్రయత్నించినా లాస్ట్ అరగంట స్క్రిప్ట్ సరిగ్గా కుదరలేదని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో దర్శకుడు కోడి రామకృష్ణ గారు కూడా విపరీతమైన సినిమాలతో బిజీగా ఉండేవారని, ఆయన కూడా షూటింగ్ ఆపి తనతో కూర్చుని లాస్ట్ 30 నిమిషాలు సరిగ్గా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. సినిమా సంక్రాంతి రేసులో ఉండాలనే తీవ్రమైన ఒత్తిడి వల్ల, సెన్సార్ ఆఫీసర్ స్వయంగా 'సినిమాను కొద్ది రోజులు వాయిదా వేసుకుని రీకరెక్షన్లు చేసుకోండి' అని సలహా ఇచ్చినా వినకుండా హడావుడిగా రిలీజ్ చేశామని, అదే ఆ సినిమా పరాజయానికి కారణమైందని ఎంఎస్ రాజు ఒప్పుకున్నారు.




