
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) కుటుంబం నుంచి మరో కొత్త వారసుడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్ (Sanchith Sanjeev) హీరోగా ఎంట్రీ ఇస్తున్న కన్నడ క్రైమ్ డ్రామా 'మ్యాంగో పచ్చా' (Mango Pachcha) జూన్ 5, 2026 న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కంటే ముందే ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్లో విపరీతమైన బజ్ను క్రియేట్ చేస్తోంది.
ఇటీవల బెంగళూరులోని కిచ్చా సుదీప్ నివాసంలో మీడియా కోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోను వీక్షించిన మీడియా వారు సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన తొలి స్పందనను పంచుకున్నారు. వారు ఇచ్చిన పాజిటివ్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఈ చిత్రంలో సంచిత్ సంజీవ్ నటనకు అద్భుతమైన మార్కులు పడ్డాయి. సంచిత్ కేవలం ఒక స్టార్ హీరో బ్యాక్గ్రౌండ్తో మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి శిక్షణతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడని ప్రశంసిస్తున్నారు. సంచిత్ ప్రఖ్యాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ మరియు ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పూర్తి చేశాడు. అంతేకాదు గతంలో సుదీప్ బ్లాక్బస్టర్ హిట్ చిత్రం ‘మాణిక్య’కు అసిస్టెంట్ డైరెక్టర్గా తెరవెనుక పనిచేసి ఇండస్ట్రీపై మంచి అవగాహన పెంచుకున్నాడు. సినిమాలో సంచిత్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయని అంటున్నారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మరియు ఎమోషనల్ సీన్స్లో సంచిత్ నటన, బాడీ లాంగ్వేజ్ కిచ్చా సుదీప్ కెరీర్ ప్రారంభ రోజుల్లోని నటనను మరియు మేనమామ మ్యానరిజమ్స్ను గుర్తుచేస్తుందని చెబుతుండటం విశేషం.
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, 2001 నుండి 2011 మధ్య కాలంలో మైసూర్ అండర్వరల్డ్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఒక సాధారణ యువకుడు మైసూర్ నేర సామ్రాజ్యంలో అత్యంత ప్రమాదకరమైన, అందరూ భయపడే 'మ్యాంగో పచ్చా'గా ఎలా రూపాంతరం చెందాడనే గ్రిప్పింగ్ పీరియడ్ డ్రామాగా దర్శకుడు వివేక దీనిని తెరకెక్కించారు.
ఆ రోజుల్లోని మైసూర్ వాతావరణాన్ని రీక్రియేట్ చేయడానికి మేకర్స్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోందని విమర్శకులు అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్, పాతకాలపు వాహనాలు మరియు లొకేషన్లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో కాజల్ కుందర్, ప్రశాంత్ హిరేమఠ్, మయూర్ పటేల్, జై, ఉగ్రమ్ మంజు కీలక పాత్రలు పోషించారు. చరణ్ రాజ్ అందించిన సంగీతం, శేఖర్ చంద్ర, స్వామిల సినిమాటోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయని తొలి రివ్యూ ద్వారా తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ వెనుక కిచ్చా సుదీప్ సపోర్ట్ పూర్తిగా ఉంది. ఆయన కేవలం సినిమా డెవలప్మెంట్లో సలహాలు ఇవ్వడమే కాకుండా, ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా అందించారు.





