అక్కినేని నాగచైతన్య తన ‘పర్సనాలిటీ రైట్స్’ రక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు నుంచి ఆయనకు ఉపశమనం లభించింది. నాగచైతన్య పేరు, ఫోటోలు, వాయిస్, వ్యక్తిగత గుర్తింపును అనుమతి లేకుండా కొన్ని అశ్లీల వెబ్సైట్లు, డిజిటల్ ప్లాట్ఫారమ్లు వినియోగిస్తున్నాయని పేర్కొంటూ ఆయన తరఫున న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జ్యోతిసింగ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ నాగచైతన్యకు రక్షణ కల్పించింది. ఈ వ్యవహారంలో సంబంధిత డిజిటల్ ప్లాట్ఫారమ్లు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు, నటుడి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ను వినియోగించవద్దని స్పష్టం చేసింది.నాగచైతన్య తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్, నటుడి పోలికలతో అనధికారిక వస్తువుల విక్రయం జరుగుతోందని, అలాగే ఏఐ ఆధారిత కంటెంట్ ద్వారా ఆయన ఇమేజ్ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
నటుడి వ్యక్తిగత జీవితం, పరువుకు భంగం కలిగించేలా కొన్ని పోస్టులు, కంటెంట్ ప్రచారం అవుతున్న విషయంపై ధర్మాసనం తీవ్రస్థాయిలో మండిపడింది. దీంతో నాగచైతన్య వ్యక్తిత్వ హక్కులను రక్షించేలా తాత్కాలిక ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణకు కేసును వాయిదా వేసింది. డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ‘పర్సనాలిటీ రైట్స్’కు ఇది కీలక కేసుగా మారగా.. సోషల్ మీడియా, ఏఐ కంటెంట్ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఈ ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.





