తారక్, మహేష్ ల మల్టీస్టారర్.. ఫ్యాన్స్ కి పండగే!
on Dec 6, 2021
టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ హవా నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7 న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక జనవరి 12 న విడుదల కానున్న 'భీమ్లా నాయక్' సినిమాలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో వెంకటేష్ తో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబు.. ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు.
గతంలో 'బిగ్ బాస్'తో ఆకట్టుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా చరణ్ రాగా.. చివరిలో ఎపిసోడ్ గెస్ట్ గా మహేష్ వచ్చాడు. ఆదివారం(డిసెంబర్ 5) టెలికాస్ట్ అయిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ఎపిసోడ్ లో తారక్, మహేష్ ల మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంది. ఫ్యామిలీతో వెకేషన్స్, పిల్లలతో తనకున్న బంధం ఇలా పలు విషయాల గురించి మహేష్ పంచుకున్నాడు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ హీరోల మధ్య ఉన్న బాండింగ్ గురించి మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జనరేషన్ హీరోలంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారనీ అన్నాడు. మల్టీస్టారర్ సినిమాలు చేయడం తనకి ఇష్టమేనని చెప్పిన మహేష్.. గతంలోనే మనిద్దరం దీని గురించి మాట్లాడుకున్నామని, కానీ తర్వాత ఇద్దరం బిజీ కావడం వాళ్ళ కుదరలేదని తారక్ ని ఉద్దేశించి అన్నాడు. తారక్ తో మల్టీస్టారర్ చేయాలని ఉందని చెప్పిన.. రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు చాలా మల్టీస్టారర్స్ చూడబోతున్నారని మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ఈ షోలో మహేష్ 25 లక్షల రూపాయలను గెలుచుకున్నాడు. ఈ డబ్బుని ఆయన సేవాకార్యక్రమాలు కోసం ఉపయోగించనున్నాడు.