Home

»

Latest News

గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు షాక్.. భారీ జరిమానా విధించిన మద్రాస్ హైకోర్టు!

Mar 24, 2026

- 15 ఏళ్ల నాటి కేసులో గౌతమ్ మీనన్‌కు చుక్కెదురు!

- రూ.4.25 కోట్లు చెల్లించాల్సిందేనన్న కోర్టు

- ఆర్ధిక వివాదంలో చిక్కుకున్న స్టార్ డైరెక్టర్

స్టైలిష్ మేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు చట్టపరంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక పాత ఆర్థిక వివాదంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గౌతమ్ మీనన్‌కు చెందిన నిర్మాణ సంస్థ 'ఫొటాన్ ఫ్యాక్టరీ' దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేస్తూ, సదరు నిర్మాతకు వడ్డీతో సహా భారీ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిణామం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమైంది.

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ వివాదం 2008లో మొదలైంది. ఆర్‌ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్‌ అధినేత ఎల్రెడ్ కుమార్‌తో కలిసి గౌతమ్ మీనన్ ఒక సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో శింబు హీరోగా ప్రొడక్షన్ నెం. 6 అనే పేరుతో సినిమా తీయడానికి గౌతమ్ మీనన్ సుమారు రూ. 4.25 కోట్లను అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఒప్పందం ప్రకారం నిర్ణీత గడువులోగా సినిమా పూర్తి కాకపోవడంతో ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది.

ఈ కేసు విచారణలో గౌతమ్ మీనన్ తరపు న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. ఆ ఒప్పందంలో భాగంగానే నాని, సమంత జంటగా నటించిన 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (తమిళంలో నీదానే ఎన్ పొన్వసంతం) చిత్రాన్ని నిర్మించామని, కాబట్టి తాము ఎటువంటి బాకీ లేమని పేర్కొన్నారు. కానీ, కోర్టు ఈ వాదనను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఆ సినిమా వేరే ఒప్పందం కింద రూపొందిందని, పాత బాకీకి దీనికి సంబంధం లేదని జస్టిస్ సెంథిల్ కుమార్ స్పష్టం చేశారు.

తాజాగా మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా పాత తీర్పునే సమర్థించింది. గౌతమ్ మీనన్ తీసుకున్న రూ. 4.25 కోట్లకు 2010 నుండి 12 శాతం వార్షిక వడ్డీని కలిపి చెల్లించాలని ఆదేశించింది. దీనితో పాటు అదనంగా రూ. 12 లక్షల కోర్టు ఖర్చులు కూడా ఆయనే భరించాల్సి ఉంటుంది. వడ్డీతో కలిపి ఈ మొత్తం ఇప్పుడు భారీ స్థాయికి చేరుకోవడంతో గౌతమ్ మీనన్‌పై తీవ్ర ఆర్థిక భారం పడనుందని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

గౌతమ్ మీనన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. వెంకటేష్‌తో తీసిన 'ఘర్షణ', నాగచైతన్యకు లైఫ్ ఇచ్చిన 'ఏ మాయ చేసావె' వంటి చిత్రాలు ఇక్కడ క్లాసిక్స్‌గా నిలిచాయి. కేవలం దర్శకుడిగానే కాకుండా, ఈ మధ్య కాలంలో ఆయన నటుడిగా కూడా ఫుల్ బిజీ అయిపోయారు. 'లియో' వంటి బిగ్ బడ్జెట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు.

ప్రస్తుతం ఒకవైపు దర్శకత్వం, మరోవైపు నటనతో కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో ఇలాంటి చట్టపరమైన చిక్కులు రావడం ఆయన అభిమానులను కలవరపెడుతోంది. 15 ఏళ్ల నాటి వివాదం ఇప్పుడు ఈ రూపంలో చుట్టుముట్టడంతో గౌతమ్ మీనన్ తదుపరి అడుగు ఎలా ఉంటుందో చూడాలి. ఆయన ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com