
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కుటుంబానికి న్యాయస్థానంలో భారీ విజయం లభించింది. చాలా కాలంగా వేధిస్తున్న ఆస్తి వివాదానికి మద్రాస్ హైకోర్టు స్వస్తి పలికింది. చెన్నైలోని శ్రీదేవి ఆస్తులపై సాగుతున్న న్యాయపోరాటంలో బోనీ కపూర్, ఆయన కుమార్తెలకు అనుకూలంగా తీర్పు వెలువడింది.
చెన్నైలోని ఈసీఆర్ (ECR) రోడ్డులో శ్రీదేవి కుటుంబానికి 2.7 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో తమకు కూడా వాటా ఉందని పేర్కొంటూ నటరాజన్, శివగామి అనే వ్యక్తులు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు, పిటిషనర్ల వాదనలో బలం లేదని తేల్చి చెప్పింది.
గత 37 ఏళ్లుగా సదరు ఆస్తి శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉందని, ఇన్నేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు కోరడం చట్టరీత్యా సమర్థనీయం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిరాటంకంగా అనుభవిస్తున్న ఆస్తిపై ఇప్పుడు వివాదాలు సృష్టించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ తీర్పుతో బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు పెద్ద ఊరట లభించింది. కొంత కాలంగా ఈ ఆస్తి వివాదం వారిని ఆందోళనకు గురిచేసింది. ఇప్పుడు హైకోర్టు పిటిషన్ను కొట్టివేయడంతో, ఆ 2.7 ఎకరాల భూమిపై శ్రీదేవి కుటుంబానికే పూర్తి హక్కులు ఉన్నాయని న్యాయపరంగా ఖరారైంది.
ఈ వివాదం ముగియడంతో శ్రీదేవి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్లో 'పెద్ది' వంటి భారీ చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో, ఈ న్యాయపరమైన విజయం ఆమెకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.






