ప్రభాస్పై ఏడ్చేస్తున్నారు..!
on Oct 7, 2016
అసూయ..ఇదొక్కటి చాలు మనిషి పతనం అవడానికి. ఎదుటి వాడు నాకంటే పైకి ఎదిగిపోతున్నాడనో..లేదంటే నన్ను కాదని పక్క వాడిని అందలం ఎక్కిస్తున్నాడనో మనిషి విపరీతంగా ఫీలైపోతాడు. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమకు ఇలాంటి అన్వయింపే కరెక్టవుతుంది. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు బ్యాంకాక్లో కొత్తగా ఏర్పాటు చేసిన మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రభాస్ నుంచి కొలతలు, ఫోటోలు తీసుకెళ్లగా..వచ్చే ఏడాది మార్చిలో ప్రభాస్ విగ్రహం అక్కడ కొలువుదీరనుంది. జాతిపిత మహాత్మ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీ తర్వాత ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న వ్యక్తిగా..మొదటి భారతీయ సినీనటుడిగా ప్రభాస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇది అందరూ సంతోషించాల్సిన విషయం.
కాని ఆశ్చర్యకరంగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరికి మాత్రం ఇది అస్సలు మింగుడు పడటం లేదు. ఎంజీఆర్, ఎన్టీఆర్, కమల్ హసన్, రజనీకాంత్ వంటి ఎంతోమంది మహామహులు ఉండగా వారిని వదిలేసి అతని విగ్రహాన్ని ఏర్పాటు చేయడమా..? అంటూ నేరుగానే వ్యాఖ్యానిస్తున్నారు. పైన ఉదహరించిన దిగ్గజాల ముందు ప్రభాస్ తక్కువే..కానీ బాహుబలి వంటి సినిమాతో అతను ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చర్చను లేవనెత్తాడు. అందుకే ప్రభాస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులకు ప్రపంచవ్యాప్తంగా అనేక విజ్ఞాపనలు అందాయి. అయినా అక్కడ ఏర్పాటయ్యేది కూడా ప్రభాస్ విగ్రహం కాదు, బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్రకి సంబంధించిన విగ్రహమే. దీనిని ప్రభాస్కి దక్కుతున్న గౌరవం అని కాకుండా బాహుబలికి, భారతీయ సినిమాకి దక్కుతున్న గౌరవం అని భావిస్తే మంచిది.