Home

»

Latest News

Kurchi Thatha: ‘కుర్చీ మడతపెట్టి’ తాత కన్నుమూత.. అసలు ఏం జరిగిందంటే?

May 21, 2026

సోషల్ మీడియా ప్రపంచంలో ఒకే ఒక్క డైలాగ్‌తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకుని, కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయిన ‘కుర్చీ మడతపెట్టి’ తాత ఇకలేరు. తనదైన మాస్ డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న మహ్మద్ పాషా (64) కన్నుమూశారు. (Kurchi Madathapetti Thatha)

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్కులో మహ్మద్ పాషా ప్రతిరోజూ లాగే వాకింగ్ చేయడానికి వెళ్లారు. అయితే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించి కాపాడేలోపే ఆయన ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్రమైన వడదెబ్బ (సన్‌స్ట్రోక్) కారణంగానే మహ్మద్ పాషా మృతి చెందినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 64 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా కనిపించే ఆయన, ఇలా వడదెబ్బకు బలికావడం అందరినీ కలచివేస్తోంది.

మహ్మద్ పాషా పేరు చెబితే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ, ‘కుర్చీ మడతపెట్టి’ తాత అంటే తెలియని తెలుగువాడు ఉండడు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన అన్న ఆ ఒక్క మాట ఇంటర్నెట్‌ను ఊపేసింది. ఆ డైలాగ్ ఎంతలా వైరల్ అయిందంటే.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో ఆ డైలాగ్‌తో ఒక ప్రత్యేకమైన సాంగ్ నే డిజైన్ చేశారు. థమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘కుర్చీ మడతపెట్టి’ పాట ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. 

‘కుర్చీ మడతపెట్టి’ తాత మరణవార్త తెలియగానే సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు లేకపోయినా మీ డైలాగ్ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది తాత’ అంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com