కొండా జీవితం మీద ఐదారు సినిమాలు తీయవచ్చు
on Jan 26, 2022
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'కొండా'. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. హనుమకొండలోని కొండా క్యాంపు ఆఫీసులో బుధవారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్లో కొండా మురళి కాలేజీ జీవితం నుంచి సురేఖతో ప్రేమలో పడటం, మావోయిస్టులతో చేతులు కలపడం, రాజకీయాల్లోకి రావడం చూపించారు. 'వాడ్ని సంపుడు నా పని కాదు, బాధ్యత' అని ట్రైలర్ చివర్లో కొండా మురళి పాత్రధారి చేత ఓ డైలాగ్ చెప్పించారు.
కొండా మురళి మాట్లాడుతూ "నేను ఆర్జీవీకి రెండు ముక్కలు చెబితే... ఆయన వంద మంది దగ్గర ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని సినిమా తీశారు. ఆయన రెండున్నర నెలలు వరంగల్లో ఉండి షూటింగ్ చేశారు. ఎక్కడా ఉండని ఆయన రెండున్నర నెలల ఇక్కడ ఉన్నారంటే కథ ఎంత నచ్చిందో తెలుస్తోంది. ఇదే జనవరి 26న నా మీద 47 బుల్లెట్లు ఫైరింగ్ చేశారు. అయినా బతికాను. అది కూడా మా కుటుంబం కోసం కాదు, ప్రజల కోసమని తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పడం కన్నా చూస్తే బావుంటుంది. త్రిగుణ్, ఇర్రా మోర్ బాగా నటించారు" అని అన్నారు.
కొండా సురేఖ మాట్లాడుతూ "ట్రైలర్ చూశాక మేం ఎంత బాధ అనుభవించామనేది గుర్తొచ్చింది. భావోద్వేగానికి లోనయ్యా. ముఖ్యంగా ఫైరింగ్ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు కూడా జనవరి 26. నేను వెళ్లేసరికి మురళిగారు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆ రోజు ఆయన మరణించి ఉంటే.. మా పరిస్థితి ఏంటో? ఆలోచించడానికి కూడా కష్టంగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన పసుపు కుంకుమ బలం కొండా మురళిగారు మన ముందు ఉండటం. ఆర్జీవీ గారి గురించి బయట విన్నదానికి, చూసిన దానికి అసలు సంబంధం లేదు. ఆయన గురించి బయట చెప్పేవన్నీ అబద్దాలు. ప్రపంచంలో ఆయనకు తెలియనిది ఏదీ లేదు. మా జీవిత చరిత్రను ఎలా తీయాలనేది మాకు ఐడియా లేదు. కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చే కుర్రాడు వస్తాడన్నట్టు దేవుడు మాకు ఆర్జీవీని చూపించారు." అని అన్నారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "కొండా దంపతులు విప్లవకారులు. నేను వాళ్లలా కాదు. నాకు విప్లవకారుడు అయ్యేంత ధైర్యం లేదు. అందుకని, ఎవరైతే రిస్కులు తీసుకుని ఉంటారో? వాళ్ల దగ్గరకు వెళ్లి 'కథ ఇస్తారా? సినిమా తీస్తా' అని తీసేస్తా. ఇదొక వయలెంట్ క్రైమ్ డ్రామా అయినా సరే... ఇందులో స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉంది. కొండా ఫ్యామిలీ యూనిక్ ఫ్యామిలీ. మురళి చెప్పిన విషయాలను రెండు గంటల సినిమాగా తీయడం చాలా కష్టం. అందులో కొన్ని విషయాలు తీసుకుని సినిమా చేశా. ఆయన జీవితం మీద ఐదారు సినిమాలు తీయవచ్చు. 'కొండా 2'లో మురళి, సురేఖ దంపతుల కుమార్తె సుష్మిత పాత్ర ఉంటుంది. 'కొండా' సినిమాలో ఓ టైమ్ పీరియడ్, గెటప్ తీసుకోవడం వల్ల ఆమె పాత్ర లేదు. మురళి అన్న చేసిన రిస్క్ వల్ల... నా కెరీర్లో డిఫరెంట్, గుడ్ సినిమా తీశానని నమ్మకం ఉంది. ప్రేక్షకులు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను" అని అన్నారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ "నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజు ఇలా హీరోగా నిలబడటం నా బిగ్గెస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను. ట్రైలర్ విడుదల రోజున ఎందుకు సక్సెస్ అంటున్నానంటే... కొండా మురళి, సురేఖ గురించి రామ్ గోపాల్ వర్మ తీసిన ఒక యాక్షన్, నక్సలైట్ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ సినిమాలో హీరో అంటే ఇంతకన్నా పెద్ద మాస్ ఏముంటుంది? నా సినిమాలు చూసి ఉంటారు. ఇప్పటి వరకూ చాలా లవ్ స్టోరీలు చేశా. ఈ సినిమా నాకు కొత్తగా ఉంటుంది. 'నేను కొత్తగా వస్తున్న సంగతి బయట కూడా తెలియాలి. పేరు మార్చుకుందామని అనుకుంటున్నాను' అని వర్మతో చెబితే... 'మార్చుకో' అన్నారు. త్రిగుణ్ పేరు ఫైనలైజ్ చేశాం" అని అన్నారు.
హీరోయిన్ ఇర్రా మోర్ మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ కథ చెప్పినప్పుడు నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకుని సురేఖ గారు ముందుకు వచ్చారు. ఆమెలా చేయడం మహిళలకు అంత ఈజీ కాదు. మురళి గారితో ప్రేమలో పడటం, కష్టాల్లో ఆయనకు అండగా ఉండటం... గాళ్ ఫ్రెండ్స్ అందరూ అలా చేయరు. ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు. సురేఖ గారు స్ట్రాంగ్ లేడీ. ఆమె పాత్ర చేయాలని అనిపించింది. ఆ పాత్రకు నేను 50 శాతం న్యాయం చేసినా హ్యాపీగా ఫీల్ అవుతా. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు మాత్రమే ఈ సినిమా తీయగలరు. యాక్టింగ్, పెర్ఫార్మన్స్ పరంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను" అని అన్నారు.