తెలుగు సినిమా చరిత్రలో కొందరు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు తమ పాటలతో, సంగీతంతో చరిత్ర సృష్టించారు. అలాంటి సంగీత దర్శకుల్లో మాధవపెద్ది సురేష్ ఒకరు. లెక్కగా చూస్తే ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా గంగిగోవు పాలు గరిటెడు చాలు అన్నట్టుగా ఆయన చేసిన ఆ కొన్ని సినిమాల్లోనే సంగీత పరంగా అద్భుతమైన విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి. ఆయన పాటలకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చెన్నయ్ లవ్స్టోరీ చిత్రానికి సంబంధించిన సాంగ్ లాంచ్ జరిగింది. చెన్నైలో ఘనంగా నిర్వహించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ కార్యక్రమానికి 12 మంది సంగీత దర్శకులు హాజరయ్యారు. వారిలో మాధవపెద్ది సురేష్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగీత దర్శకుల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సినీ సంగీత ప్రయాణంలో కీబోర్డ్ ప్లేయర్ల ప్రాధాన్యత గురించి సురేష్ సరికొత్త విశ్లేషణ చేశారు. ఒక అద్భుతమైన కీబోర్డ్ ప్లేయర్ భవిష్యత్తులో అంతకంటే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కాగలడని ఆయన అభిప్రాయపడ్డారు. సంగీత సాధన చేసే క్రమంలో కీబోర్డ్ వాయించే వారికి అన్ని రకాల వాయిద్యాలు, ట్యూన్లు, రిథమ్స్ పై పూర్తి అవగాహన వస్తుందని.. ఆ అనుభవమే వారిని టాప్ కంపోజర్లుగా మారుస్తుందని మాధవపెద్ది సురేష్ వివరించారు. దీనికి ఉదాహరణగా భారతీయ చలనచిత్ర రంగాన్ని ఏలిన లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్లు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, మణిశర్మ వంటి దిగ్గజాల పేర్లను ఆయన గుర్తుచేశారు. వీరంతా ఒకప్పుడు కీబోర్డ్ లేదా పియానో ప్లేయర్లుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కాలక్రమేణా అగ్ర దర్శకులుగా ఎదిగారని చెప్పుకొచ్చారు.
ఈ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా సినిమా నుంచి ‘వదలనే’ అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ప్రసిద్ధ నిర్మాతలు సాయి రాజేష్, ఎస్.కె.ఎన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కిరణ్ అబ్బవరం సరసన శ్రీ గౌరి ప్రియ కథానాయికగా నటిస్తోంది.
ఇక ఈ ఆడియో లాంచ్ వేడుకకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి వంటి దిగ్గజాలు హాజరుకావడం విశేషం. సీనియర్ల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ మరియు కిరణ్ అబ్బవరంపై మాధవపెద్ది సురేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, కిరణ్ అభిమానులు ఈ కామెంట్స్ పై ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






