Home

»

Latest News

SJ Suryah: ఎస్‌జే సూర్య కిల్లర్ షూటింగ్ సెట్‌లో ఘోర ప్రమాదం.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

Jun 3, 2026 2:21PM

 

 

-సినీ ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం 
-మదన్ అనే  25 ఏళ్ల యువకుడి దుర్మరణం
-మరో నలుగురికి తీవ్ర గాయాలు 
-ఇంకా స్పందించని సూర్య 
-రంగంలోకి పోలీసులు 

వర్సటైల్ యాక్టర్, దర్శకుడు ఎస్‌జే సూర్య(S.J Suryah)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 'కిల్లర్'(Killer). ఈ రోజు  తెల్లవారుజామున  షూటింగ్‌ సెట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక యువ క్రూ మెంబర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా కోలీవుడ్‌తో పాటు  యావత్తు దక్షిణ చిత్ర సీమ దిగ్భ్రాంతికి గురైంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని పెరంబూర్ పరిధిలో గల చారిత్రాత్మక 'ఒట్టేరి బిన్నీ మిల్' ప్రాంగణంలో 'కిల్లర్' కి సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున సుమారు ఐదు గంటల సమయంలో, బాంబు పేలుడుకి సంబంధించిన ఒక హై రిస్క్ సీన్‌ని  డైరెక్టర్ ప్లాన్ చేశాడు  ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం కొన్ని గ్యాస్ సిలిండర్లని  సిద్ధం చేయగా, గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా ఊహించని విధంగా భారీ శబ్దంతో పేలింది. ఆ పేలుడు ధాటికి అక్కడి ప్రాంతమంతా దట్టమైన పొగలు, మంటలు అలుముకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న  25 ఏళ్ల యువకుడు మదన్ తీవ్రంగా గాయపడ్డాడు. సిలిండర్ పేలిన తీవ్రతకి  అతడి శరీరానికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతడిని హాస్పిటల్ కి  తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల మదన్ అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కేవలం ఇరవై ఐదు ఏళ్ల వయసులోనే, సినిమాపై ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వచ్చిన ఒక యువకుడు ఇలా అకాల మరణం చెందడం సెట్‌లోని ప్రతి ఒక్కరినీ కన్నీటిపర్యంతం చేసింది.

Also read: Shivaraj Kumar: గౌరనాయుడు అసలు క్యారక్టర్ ఈ హీరోదే.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం

ఈ ప్రమాదంలో  మరో పది మందికి పైగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులందరినీ తక్షణమే చెన్నైలోని ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కి తరలించి, అత్యవసర చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  హై రిస్క్ యాక్షన్ సీన్లు చిత్రీకరించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలని పాటించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులైతే తమ విచారణని మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఈ ఘటనపై ఎస్‌జే సూర్య  అధికారికంగా స్పందించలేదు. మదన్ ఆకస్మిక మరణంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com