
తెలుగు చిత్ర పరిశ్రమలోని డ్యాన్సర్స్ అసోసియేషన్ కేంద్రంగా గత కొన్ని రోజులుగా చెలరేగిన తీవ్ర వివాదం ఇప్పుడు పోలీస్ కేసులు, ఫిర్యాదుల వరకు వెళ్లింది. డాన్సర్స్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు రఘు మాస్టర్ కార్యవర్గం చెల్లదంటూ జానీ మాస్టర్ సతీమణి, ప్రముఖ డాన్సర్ సుమలత హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. దీంతో పోలీసులు రఘు మాస్టర్ ని పిలిచి విచారించినట్టుగా తెలుస్తుంది.
ఈ వివాదానికి ప్రధాన బీజం డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు కార్యవర్గ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. జానీ మాస్టర్ సస్పెన్షన్ అనంతరం, ఆయన సతీమణి సుమలత డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఏకపక్షంగా బై ఎలక్షన్స్ నిర్వహించారని మెజారిటీ సభ్యులు ఆరోపించారు. ఈ బై ఎలక్షన్లలో అసోసియేషన్కు చెందిన దాదాపు 600 మంది సభ్యులలో కేవలం 116 మంది మాత్రమే పాల్గొనడం, మిగిలిన 480 కంటే ఎక్కువ మంది దూరంగా ఉండడం సంచలనం సృష్టించింది. ఈ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అసోసియేషన్లోని 350 మందికి పైగా సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియలో రఘు మాస్టర్ని తమ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జానీ మాస్టర్ వర్గానికి పెద్ద షాక్గా మారింది.
.webp)
Also read: రోమాంచకం ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. టాక్ పరిస్థితి అయితే ఇదే!
శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, ప్రకాష్ మాస్టర్, విజయ్ పొలాకి, విజయ్ బిన్నీ, సృష్టి వర్మ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లు రఘు మాస్టర్ ప్యానెల్కే తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలుగు ఫిలిం ఇంపాజిట్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా రఘు మాస్టర్ ప్యానెల్కే మద్దతు పలికింది. ఫెడరేషన్ నిబంధనలను ధిక్కరించి సుమలత కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలను ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని తీవ్రంగా తప్పుపట్టారు. నిమిషాల పుస్తకం (Minutes Book) లో సంతకాలు లేకుండానే కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేశారని, ఫెడరేషన్ సహకారం లేనిదే 24 క్రాఫ్ట్లలో పనులు చేయడం కుదరదని స్పష్టం చేశారు. పైగా జానీ మాస్టర్ యొక్క సస్పెన్షన్ను కూడా పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరేషన్ గుర్తింపు ఉన్న డ్యాన్సర్లతోనే నిర్మాతలు పనిచేయడానికి మొగ్గు చూపుతారని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ స్పష్టం చేయడంతో సుమలత వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివాదాస్పద వైఖరి వల్ల జానీ మాస్టర్ 'ది ప్యారడైజ్' చిత్రంలో ఓ సాంగ్ కొరియోగ్రఫీ అవకాశాన్ని కోల్పోయారని, ఫెడరేషన్ సహకారం లేకపోతే బాలీవుడ్ మరియు కోలీవుడ్ అవకాశాలకు కూడా గండి పడే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వివాదం ఇక్కడితో ఆగక లీగల్ పోరాటానికి దారితీసింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి వంటి పెద్దలు రంగంలోకి దిగి చర్చలు జరిపినప్పటికీ వివాదం సద్దుమణగకపోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
[Jani Master, Sumalatha, Raghu Master, Police case, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]






