ఎన్టీఆర్ తో సినిమాపై జాన్వీ కపూర్ రియాక్షన్
on Aug 4, 2022
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆమె నటించే మొదటి తెలుగు సినిమాకి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన జాన్వీ తారక్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ సరసన జాన్వీ నటించనుందని, లేదా బుచ్చిబాబు దర్శకత్వంలో తారక్ చేయనున్న సినిమాలోనైనా కనువిందు చేయనుంది అంటూ న్యూస్ వినిపిస్తోంది. తారక్ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఖాయమని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ న్యూస్ పై జాన్వీ స్పందించింది.
జాన్వీ నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ లక్ జెర్రీ' ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న జాన్వీకి.. ఎన్టీఆర్ సినిమా ఆఫర్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "నిజానికి నేను తెలుగు సినిమా లేదా ఏదైనా సౌత్ సినిమా చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. అందులోనూ ఎన్టీఆర్ సర్ తో కలిసి పని చేసే అవకాశమొస్తే అంతకు మించిన సంతోషం ఉండదు. ఆయనొక లెజెండ్. ఆయన సినిమాలో నేను నటించబోతున్నట్లు వస్తున్న రూమర్ నిజమైతే నా అంత అదృష్టవంతురాలు ఉండరు. కానీ దురదృష్టవశాత్తూ మీరనుకుంటున్నట్లుగా ఆయన సినిమా నుంచి నాకెలాంటి ఆఫర్ రాలేదు. ఆయనతో కలిసి పని చేయడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.