
హైదరాబాద్ నగర సినీ ప్రియులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది నిజంగానే అదిరిపోయే గుడ్ న్యూస్. 12 ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడబోతోంది. నగరంలో ఒరిజినల్, లైసెన్స్డ్ ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్ పునరాగమనం చేయబోతోంది.
ఒకప్పుడు హైదరాబాద్లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐమ్యాక్స్ 70mm ప్రొజెక్టర్ స్క్రీన్ ఉండేది. అయితే, కొన్ని సాంకేతిక కారణాలు మరియు డిజిటల్ ఫార్మాట్ మార్పుల వల్ల 2014వ సంవత్సరంలో ఈ ఐమ్యాక్స్ స్క్రీన్ను పూర్తిగా తొలగించి, సాధారణ పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్గా మార్చేశారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోని మూవీ లవర్స్ అంతా ఒక పవర్ఫుల్ ఐమ్యాక్స్ స్క్రీన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఆ నిరీక్షణకు స్వస్తి పలుకుతూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత ఏషియన్ సునీల్ నారంగ్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ లో సరికొత్త లైసెన్స్డ్ ఐమ్యాక్స్ స్క్రీన్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ మెగా ప్రాజెక్ట్లో ఏషియన్ సునీల్తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా భాగస్వాములుగా చేరడం ఇండస్ట్రీ వర్గాల్లో మరింత హాట్ టాపిక్ గా మారింది. హీరోల భాగస్వామ్యంతో ఇప్పటికే పలు మల్టీప్లెక్స్లను నిర్మించిన ఏషియన్ గ్రూప్, ఈ సరికొత్త ఐమ్యాక్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటిలను భాగస్వాములుగా రంగంలోకి దించుతోంది.
టాలీవుడ్లో ప్రస్తుతం వారణాసి, రాకా వంటి విజువల్ వండర్స్ మరియు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఇలాంటి క్రేజీ సినిమాలను సరైన లార్జ్ ఫార్మాట్లో ఎక్స్ పీరియన్స్ చేయాలంటే ఐమ్యాక్స్ స్క్రీన్ అత్యంత అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, హకీంపేట్ ఏరియా సమీపంలో ఒక భారీ లేజర్ ఐమ్యాక్స్ థియేటర్ను నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
గత 12 ఏళ్లుగా హైదరాబాద్ సినిమా ప్రేక్షకులు కోల్పోయిన ఐమ్యాక్స్ ఎక్స్పీరియన్స్ను మళ్లీ తిప్పితీసుకురావడానికి ఏషియన్ సునీల్ అండ్ టీమ్ గట్టి ప్లానే వేసింది. ఈ సరికొత్త థియేటర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అని సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.




.webp)

