
ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు 'ఆస్కార్' పేరు వింటేనే సినీ ప్రేమికులు పరవశించిపోతుంటారు. మరి అలాంటిది సినీ మేకర్స్ కి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తమ జీవిత ధన్యమయినట్టుగా భావిస్తారు. అలాంటి ఆస్కార్ వేదికపై మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే చిత్రం ఏంటనే ప్రతిష్ఠాత్మక ఉత్కంఠకి ఎట్టకేలకు తెరపడింది.
ఈ ఏడాది బాలీవుడ్, టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలను, పాన్ ఇండియా రేసులోని అతిపెద్ద సినిమాలను సైతం దాటుకుని, కేవలం 4 కోట్ల పరిమిత బడ్జెట్తో తెరకెక్కిన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ "గోంధళ్" (Gondhal) ఆస్కార్స్ 2027 అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. 99వ అకాడమీ అవార్డులలో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం' కేటగిరీ విభాగంలో మన దేశ సినీ జెండాని ఎగురవేయనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన వెంటనే సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
మొత్తం 14 మంది సభ్యులతో కూడిన సీనియర్ సినీ ప్రముఖుల జ్యూరీ కమిటీకి ప్రముఖ దర్శకుడు పి. శేషాద్రి చైర్మన్గా వ్యవహరించారు. ఈ కమిటీ దాదాపు 10 రోజుల పాటు నిశితంగా పరిశీలించి, దేశవ్యాప్తంగా వివిధ భాషల నుండి వచ్చిన 33 చిత్రాలలోని తీవ్రమైన పోటీని ఎదుర్కొని చివరికి ఏకగ్రీవంగా 'గోంధళ్' వైపు మొగ్గు చూపింది. ఈ ఆస్కార్ రేసులో పోటీపడిన 33 సినిమాలలో 14 హిందీ చిత్రాలు, 4 మరాఠీ, 4 తెలుగు, 4 గుజరాతీ, 3 తమిళ చిత్రాలతో పాటు ఇతర ప్రాంతీయ భాషల సినిమాలు కూడా ఉన్నాయి. కాగా, ఆఖరి రేసులో టాప్ 3 స్థానాల్లో గోంధళ్తో పాటు 'అంగ్' (Angh), 'ఇక్కిస్' (Ikkis) చిత్రాలు నిలిచాయని కమిటీ చైర్మన్ తెలిపారు. దర్శకుడు సంతోష్ దావఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆయనకు మొదటి పూర్తి స్థాయి సినిమా కావడం మరొక విశేషం. గ్రామీణ మహారాష్ట్ర నేపథ్యంతో పాటు అక్కడి సాంప్రదాయ జానపద పూజా క్రతువు అయిన 'గోంధళ్' చుట్టూ ఈ కథ నడుస్తుంది.
ఇది కూడా చదవండి: ట్రైలర్, టీజర్ తో సినిమా మొత్తం చెప్పేయడం ఎంతవరకు కరెక్ట్! మంచి జరిగేది ఎవరికి!
సంగీతం, నృత్యం, సాంప్రదాయ విశ్వాసాల నడుమ ఒకే ఒక్క రాత్రి జరిగే ఉత్కంఠభరిత సంఘటనలతో, అణచివేతకు గురైన నవవధువు చుట్టూ మానసిక సంఘర్షణల కథాంశంగా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నిర్మితమైంది. భారతీయ చిత్రసీమ చరిత్రలోనే తొలిసారిగా సుమారు 25 నిమిషాల నిడివి కలిగిన ఏకధాటి 'వన్-టేక్' (Single Continuous Shot) సీన్ను ఈ సినిమాలో చిత్రీకరించి సాంకేతిక అద్భుతాన్ని సృష్టించారు. అంతేకాక, ఈ సినిమాకి భారతీయ సంగీత దిగ్గజం, పద్మవిభూషణ్ ఇళయరాజా అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించడం చిత్రానికి ప్రధాన బలంగా మారింది. ఆస్కార్ ఎంట్రీగా నిలవడానికి ముందే ఈ చిత్రం అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకుంది.

56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025) వేదికగా దర్శకుడు సంతోష్ దావఖర్ ప్రతిష్ఠాత్మక 'సిల్వర్ నెమలి' (Silver Peacock) ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకోగా, బెంగళూరు, పుణే ఫిల్మ్ ఫెస్టివల్స్లోనూ పలు అవార్డులను కైవసం చేసుకుంది. మరాఠీ సినిమా చరిత్రలో ఇప్పటివరకు 'శ్వాస్' (2005), 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ' (2009), 'కోర్ట్' (2015) చిత్రాల తర్వాత ఆస్కార్కు ఎంపికైన 4వ మరాఠీ చిత్రంగా గోంధళ్ చరిత్రకెక్కింది.
అకాడమీ అవార్డుల చరిత్రలో భారత్ నుండి 'మదర్ ఇండియా', 'సలాం బాంబే', 'లగాన్' మాత్రమే నామినేషన్ వరకు వెళ్లినందున, రాబోయే మార్చి 14, 2027లో లాస్ ఏంజిల్స్లోని డోల్బీ థియేటర్లో జరిగే 99వ ఆస్కార్స్ వేదికపై ఈ మరాఠీ చిత్రం భారతదేశానికి తొలి విజయాన్ని అందిస్తుందేమోనని దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పెద్ది, ధురంధర్ సైతం ఆస్కార్ నామినేషన్ కోసం పోటీపడ్డాయి.
మీకు నచ్చవచ్చు: సిగ్మా' ట్రైలర్ ఎలా ఉంది: విజయ్ కొడుకు సందీప్ కిషన్ ని ఎంచుకోవడానికి కారణం:
[Gondhal , Gondhal Indias Official Entry Oscars 2027, Santosh Davakhar, Ilaiyaraaja , Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]






