ఆ సంక్రాంతి సినిమాకి 15 కోట్లు వస్తే చాలు!
on Dec 21, 2019
సంక్రాంతికి సూపర్ స్టార్ మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ 'అల.. వైకుంఠపురములో' సినిమాలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను ఆ రెండు సినిమాలు పంచుకుంటున్నాయి. ఒక రోజు ముందుగా రావడం వల్ల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు కలెక్షన్ల పరంగా అదనపు లాభం జరగనున్నది. ఆ సినిమా జనవరి 11న వస్తుంటే, 'అల.. వైకుంఠపురములో' మూవీ జనవరి 12న విడుదలవుతోంది. అలాగే తలైవా రజనీకాంత్ సినిమా 'దర్బార్'కూడా జనవరి 15న రిలీజవుతోంది. మాస్లో మహా క్రేజ్ ఉన్న ఈ సూపర్ స్టార్ల సినిమాల మధ్యలో నందమూరి కల్యాణ్ రామ్ మూవీ 'ఎంత మంచివాడవురా' కూడా వస్తోంది. దాన్ని జనవరి 15న రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు సంకల్పించారు.
సాధారణంగా సంక్రాంతి సీజన్లో భారీ సినిమాల మధ్యలో స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు రావు. ఎందుకంటే వాటికి థియేటర్లు దొరకవు కాబట్టి. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ టైంలో రిలీజ్ చేయవద్దని వాటి నిర్మాతల్ని కూడా హెచ్చరిస్తుంటారు. అయితే 'ఎంత మంచివాడవురా' సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్లు పాజిటివ్గా రెస్పాండ్ అవడం విశేషంగా చెప్పుకోవాలి. కారణం.. ఆ సినిమా కంటెంట్ అనే మాటే వినిపిస్తోంది. గుజరాతీ సినిమా 'ఆక్సిజన్' ఆధారంగా ఈ సినిమాని 'శతమానం భవతి' ఫేం డైరెక్టర్ సతీశ్ వేగేశ్న రూపొందిస్తున్నాడు. కథాంశం మాత్రం తీసుకొని తెలుగువాళ్ల సెన్సిబిలిటీస్కు తగ్గట్లు సన్నివేశాల్ని కొత్తగా అల్లి ఆయన ఈ సినిమా తీస్తున్నాడు. ఇవాళ మన కుటుంబాల్లో బంధాలు ఎంతగా పలుచన అవుతున్నాయో తెలిసిందే. కొడుకులు, కూతుళ్లు ఉన్నప్పటికీ వాళ్ల అనురాగానికి నోచుకోని వృద్ధులది ఒక రకం వెత అయితే, పెద్దవాళ్లు లేని పిల్లలు అనుభవించే బాధలు ఇంకోరకమైనవి. ఆ బంధాల్ని తాత్కాలికంగా అయినా అందించి వాళ్లను ఆనందింపజేసే ఒక బృందం కథే 'ఎంత మంచివాడవురా'. అంటే ఈ సినిమాలో హీరో ఒక్కో కుటుంబంలో ఒక్కో పాత్ర పోషిస్తూ, వాళ్లను ఆనందింపజేస్తూ, వాళ్లకు ఆ అనుబంధం రుచిని అందిస్తూ వస్తాడు. అందరి చేతా 'ఎంత మంచివాడవురా' అనిపించుకుంటాడు. అతని బృందంలోని వ్యక్తులు కూడా అలాంటి బంధాల్నే అందిస్తూ వస్తారు.
నిజం చెప్పాలంటే బంధాలు మిస్సవుతున్నామని ఫీలయ్యే వాళ్లకి కనెక్టయ్యే ఈ సినిమా, అందరూ ఉండికూడా మెకానికల్గా జీవిస్తూ, బంధాలను మర్చిపోయేవాళ్లకూ కనెక్టవుతుందని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. హీరో హీరోయిన్లు కల్యాణ్ రామ్, మెహ్రీన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు నరేశ్, రాజశ్రీ నాయర్, ప్రవీణ్, భద్రం వంటివాళ్లు ఈ సినిమా చేస్తున్నప్పుడే తాము కూడా కంటెంట్కు బాగా కనెక్టయ్యామనీ, రేపు ప్రేక్షకులు సైతం కచ్చితంగా కనెక్టవుతారనీ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఆ నమ్మకంతోటే డిస్ట్రిబ్యూటర్లు సైతం సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నైజాంలో ఈ సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం గమనార్హం. అందువల్ల ఈ సినిమా కోసం ఇప్పటికే థియేటర్లను ఆయన ఎంపికచేసి పెట్టేశారు. మిగతా చోట్ల ఎక్కువగా 'శతమానం భవతి' డిస్ట్రిబ్యూటర్లే 'ఎంత మంచివాడవురా' మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
'సరిలేరు నీకెవ్వరు' మూవీ సేఫ్ కావాలంటే 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ రావాలి. 'అల.. వైకుంఠపురములో' డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకోవాలంటే 90 కోట్లకు పైగా వసూలవ్వాలి. కానీ 'ఎంత మంచివాడవురా' చిత్రానికి 15 కోట్లు వస్తే చాలు.. డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. కుటుంబ బంధాల్ని కొత్త కోణంలో చూపిస్తున్న ఈ సినిమా విడుదలకు సంక్రాంతి సీజన్ను మించిన మరో కరెక్ట్ టైం ఉండదనే ఉద్దేశంతో నిర్మాతలు ముందుకు అడుగేస్తున్నారు. పాతికేళ్లుగా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉండి, సంగీతప్రియుల హృదయాల్లో గట్టి ముద్ర వేసిన ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారి ఫిల్మ్ ప్రొడక్షన్లో ప్రవేశించి, ఈ సినిమాని నిర్మిస్తోంది. నానితో 'జెంటిల్మన్', సుధీర్బాబుతో 'సమ్మోహనం' వంటి చక్కని చిత్రాల్ని నిర్మించిన శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ 'ఎంత మంచివాడవురా' సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ ఇవ్వగా ఇప్పటికే రిలీజైన రెండు పాటలు శ్రోతల్ని అలరించాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ధీమాగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందా? లెటజ్ వెయిట్ అండ్ సీ...